భగవంతుడిపై విశ్వాసం, నమ్మకం భక్తులను ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది అని చెప్పడానికి నిలిచే ఉదాహరణల్లో కైలాస మానస సరోవర యాత్ర ఒకటి. ఇది ఎంతో సాహసంతో కూడుకున్న యాత్ర. భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అద్భుతమైన యాత్రను పూర్తి చేయాలని కోరుకుంటారు. మానస సరోవరంలో స్నానం చేయడం, కైలాస పర్వతాన్ని దర్శించడం కోట్లాది హిందువుల ఆకాంక్ష. సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం అంత సులభమైన పని కాదు. కొన్ని సార్లు యాత్రికులకు ఊపిరి ఆడని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కఠినమైన హిమాలయాల్లో చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఈ అద్భుతమైన క్షేత్రం ఉంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం, ఋతుపవనాల సమయంలో భక్తులను యాత్ర చేసేందుకు అనుమతి ఇస్తారు.
కైలాస్ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న నాలుగు పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం. గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండికొండలా మిలమిల మెరిసే కైలాన దర్శనం అద్భుతం. ఈ పర్వత పాద పీఠంలో బ్రహ్మ మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్స్ మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్చత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు.
హిమాలయాల్లోని మానస సరోవరం బ్రహ్మ సృష్టి అని విశ్వాసం. 352 చదరపు అడుగుల వైశాల్యం, 300 అడుగుల లోతు, చుట్టు కొలత 82 మైళ్లు వుంటుందని అంచనా. సరస్సును చుట్టి రావడం కష్టం. ఈ సరస్సులో దేవతలు తేజోరూపాల్లో వచ్చి స్నానం చేసి వెళతారట. సాక్షాత్తూ పరమేశ్వరుడు తెల్లవారు జామున పవిత్ర జలాల్లో స్నానమాడతారట. ఈ నీరు స్వచ్ఛంగా తియ్యగా వుంటుంది. సాక్షాత్తు దేవగంగ, ఇంద్రాది దేవతలు తిరుగాడు చోటు. సరస్సులో నీరు క్షణక్షణం రంగులు మారుతుంటుంది. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు అత్యంత మనోహరంగా వుంటాయి ఇక్కడ.
కైలాసగిరికి ఎన్నో పేర్లున్నాయి. హేమాద్రి, రజతాద్రి, సుషుమ్న కనకాచలము, దేవ పర్వతము, అమరాద్ర, సుమేరు అనే పేర్లతో విరాజిల్లుతుంది. ఈ పర్వత రాజం పురాణ ప్రసిద్ధం. పరమేశ్వరుడు ఈ వెండికొండపై వేంచేసి త్రిలోకాలను రక్షిస్తున్నాడు. జగదాంబ, పార్వతీ దేవి, సర్వమంగళగా సర్వజగత్తును తన మహిమోన్నతమైన శక్తి చేత కాపాడుతుంది. ఈ పర్వతానికి శ్రీచక్రమని కూడా పేరు. ఇది జ్ఞానానికి, మోక్షానికి గుర్తుగా భావిస్తారు. జైనులు ఈ కొండను ఆదినాథ క్షేత్రమని పేరు పెట్టారు.
ఇది శివుని తాండవలీలా ప్రదేశం. ఈ కొండ వింతవింతలుగా, వెండి, బంగారు కాంతులతో ప్రకాశిస్తుంటుంది. నటరాజు యొక్క నాట్యలీలా విలాస కేంద్రం అంటూ మునులు, రుషులు కీర్తిస్తారు. ఎంతో ప్రయాసలకు లోనై ఈ ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఆర్థిక భారంతో పాటు శారీరక బాధలెక్కువ. ఆరోగ్యంగా వున్నవారే ప్రయాణం చేయాలి. మానస సరోవరంలో స్నానం ఆత్మానందం కలిగిస్తుంది. ఆత్మశుద్ధికి తోడ్పడుతుంది. జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరం దర్శించి పరమేశ్వరుని అపార కరుణాకటాక్షాలు పొందాలని హిందువుల ఆకాంక్ష.