మనం గుడికి వెళ్లే సమయంలో పూజ సామాగ్రి తీసుకెళ్తు ఉంటాం. దేవుడికి అర్పించే పూజ సామాగ్రి లో పుష్పాలది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలా ? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి తెలిసి వుండదు.
భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ‘గీత’లో చెప్పాడు. ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన, నిష్కపటమైన మనస్సుతో పూజించి తరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది. సాక్షాత్తు శ్రీక్రిష్ణభగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చాడంటే.. భగవదారాధనలో పుష్పాల పాత్ర ఎంత అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు.
అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి అయిన వస్తువులుగా మారాయి. అయితే.. దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి, శుభ్రతతో కూడుకున్నదై వుండాలి. పురిటివారు, మైలవారు బహిష్టులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అలాంటి పూలు పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
అలాగే ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి. అలాగే మహాశివుని మారేడు దళాలతో పూజించడంవల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. అలాగే పవళ మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. ఈ పుష్పాలతో పూజవల్ల శ్రీమహాలక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది. శాస్త్రం పుష్పాలకు పూజలో పెద్ద పీఠ వేసింది.