మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి భోళా శంకరుడు అని అంటారు. బిళ్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. అయితే ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. అలా పూజించడానికి ఓ ప్రత్యేకమైన కారణముంది. ‘సోమ’ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు, శివుడు గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
దక్ష రాజు తన 27 మంది దత్త పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ 27 మందిని 27 నక్షత్రాలుగా చెబుతారు. అయితే వీరందరిలో చంద్రుడికి రోహిణి అంటేనే ఎంతో ఇష్టం. అందుకే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. చంద్రుడు తమను నిర్లక్ష్యం ప్రవర్తన పట్ల ఆగ్రహనికి గురైన మిగతా భార్యలు తండ్రి దక్ష రాజుకు ఫిర్యాదు చేస్తారు. ఈ విషయంలో దక్షుడు చంద్రుడిని పలుమార్లు బతిమాలినా, హెచ్చరించినా ప్రయోజనముండదు. దీంతో కోపోద్రిక్తుడైన దక్ష రాజు… అందవీహీనుడివై కుంచించుకు పోతావని చంద్రుడిని శపిస్తాడు.
ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా.. తన మెరుపును, పరిమాణంలోనూ కుంచించుకుపోతాడు. దక్ష శాపం వలనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించిన చంద్రుడు.. సహాయం కోసం బ్రహ్మదేవుడిని శరణుగోరుతాడు. అప్పుడు విధాత.. ఈ సమస్యకు శివుడొక్కడే పరిష్కారమార్గం చూపించగలడని చంద్రుడికి హితవు చెబుతాడు… దాంతో అతడు శివుడికి తన గోడును వెల్లబోసుకున్నాడు.
భక్తితో పరమశివుని ప్రార్థించి ప్రసన్నం చేసుకంటాడు చంద్రుడు. అయితే అప్పటికే దక్ష శాపం ప్రభావం చూపిచడం మొదలు పెట్టాగా.. ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరింపలేకపోతాడు శివుడు. అందువల్ల పదిహేను రోజులకోసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ.. మిగిలిన 15 రోజులు కుదించికు పోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు. ఈ కారణంగానే మనకు పౌర్ణమి, అమవాస్యలు ఏర్పడుతున్నాయి.
కాగా చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తున్నారు. అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడని అని కూడా పిలుస్తుంటారు. ఈ కారణంగానే శివుడిని సోమవారం రోజు పూజించడం మొదలుపెట్టారు. ఆ రోజు మహేశ్వరుడిని సేవిస్తే సమస్యల నుంచి మహాదేవుడు తమను రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు.