హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలనేవి ఉన్నాయి. అలా అనాదిగా వస్తున్న ఆచారాలలో కుంభమేళా ఒకటి. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. కుంభమేళా ఉత్సవం మొత్తం నాలుగు పుణ్యక్షేత్రాలలో జరుగుతుంది. మరి కుంభమేళా ఎలా వచ్చింది? కుంభమేళా జరిగే ఆ నాలుగు ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయనే మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ముఖ్యమైన నదులకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇక కుంభమేళా విషయానికి వస్తే, కుంభమేళా ఉత్సవం మొత్తం నాలుగు పుణ్యక్షేత్రాలలో జరుగుతుంది. అవి ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని గంగ నది, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం, మధ్యప్రదేశ్ ఉజ్జయిని లోని శిప్రానది, మహారాష్ట్ర నాసిక్ లోని గోదావరి నదిలో కుంభమేళా జరుగుతుంది. ఈ నాలుగు ప్రదేశాలలో 12 సంవత్సరాలకి ఒకసారి ఒక్కో ప్రదేశంలో కుంభమేళా జరుగుతుంది. అయితే ఇలా కుంభమేళా ఉత్సవం జరగడానికి కారణం ఏంటంటే, పూర్వం క్షిర సముద్రం చిలికినప్పుడు లభించిన అమృతబాండం కోసం దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు అమృత కుంభాన్ని పట్టుకొని పరుగెత్తుతూ హరిద్వార్, ప్రయాగ్, ఉజ్జయిని, నాసిక్ అనే నాలుగు చోట్ల దింపాడని ఆ సమయంలో అమృత బిందువులు ఈ ప్రదేశాలలో పడగ ఆ బిందువులను సేకరించడానికి ఈ ఉత్సవం ప్రారంభించారని చెబుతారు.
ఇక విషయంలోకి వెళితే, అలహాబాద్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 15 నుంచి మర్చి 4 వ తేదీవరకు అర్దకుంభమేళా జరగనుంది. అర్దకుంభమేళా అనగా ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి జరిగే దానిని అర్దకుంభమేళా అని అంటారు. అదేవిధంగా ప్రతి 12 సంవత్సరాలకు జరిగే దానిని పూర్ణ కుంభమేళా అని అంటారు అయితే పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత 144 సంవత్సరాలకు మహా కుంభమేళా జరుగుతుంది.
ఇలా జరిగే ఈ కుంభమేళా ఉత్సవానికి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే హిమాలయాల్లో, అడవుల్లో, జనం లేని ప్రదేశాల్లో నివసించే కొన్ని లక్షల మంది సాధువులు, సన్యాసులు సరిగ్గా కుంభమేళా ప్రారంభం అయ్యే సమయానికి అక్కడికి చేరుకుంటారు. వీరు అంత కూడా ఎటునుండి ఎలా వచ్చారు, ఎలా వెళ్లిపోయారనేది కూడా ఆ సమయంలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది.
అలహాబాద్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 15 నుంచి మర్చి 4 వ తేదీవరకు అర్దకుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాకు దాదాపుగా 15 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ప్రయాగ్ రాజ్ లోనే 2025 లో పూర్ణకుంభమేళా కూడా జరుగనుంది.