మన హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం ఆచారంగా ఉంది.అలాగే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారినప్పుడు కూడా పాలు పొంగిస్తారు. కొత్తింట్లో పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా అని అడిగితే తెలియని వాళ్లు బిక్కమొహం వేసుకొని చూస్తారు. అదే తెలిసినవాళ్లను అడిగితే వాళ్లకు తోచింది చెబుతుంటారు. అయితే పాలు పొంగించే సంప్రదాయం పురాణకాలం నుంచి ఉందని..ఆనందాలు వెల్లివిరిసి అంతా శుభాలే జరుగుతాయనే నమ్మకం.
లక్ష్మి దేవి సముద్ర గర్భం నుండి జన్మించింది.లక్ష్మి పతి శ్రీహరి పాల సముద్రంలో పవళిస్తారు. అందువల్ల పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి కలుగుతాయని నమ్మకం. కొత్తగా కట్టిన ఇంటిలోకి ముందుగా గోవును పంపించి ఆ వెనక యజమాని వెళతాడు.
గోవు కామధేనువుకు ప్రతిరూపం.అటువంటి గోవు ఇంటిలో తిరిగితే ఇంటిలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే కొత్త ఇంటిలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి వారి చేత పొయ్యి వెలిగించి వారు పాలను పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తే ఆ ఇంటిలో సుఖ సంతోషాలకు,సంపదకు కొదవ ఉండదని నమ్మకం.
ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంటి ఆడపడుచుచేత పాలను పొంగిస్తారు. అంతేకాక ఈ కార్యక్రమానికి బంధువులను పిలవటం వలన ఆనందంగా గడపటమే కాకుండా అందరూ ఒకచోట చేరటానికి దోహదం చేస్తుంది. మాములు రోజుల్లో కూడా అప్పుడప్పుడు పాలుపొంగిపోయానని బాధపడతాం. కానీ పాలు పొంగడం అంటే అగ్నిదేవుణ్ని ఆహ్వానిస్తున్నాం అని అర్ధం అంట.