అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టు. ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో.. చాలా ప్రత్యేకతలున్నాయి. అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి.
మహిళలు తమ తమ భర్తల క్షేమం కోసం, వారు సౌభాగ్యంగా ఉండాలని బొట్టు పెట్టుకుంటారు.
భక్తులు పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు.దేవాలయాల్లో దైవాన్ని దర్శించుకునేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు.
అయితే ఇందులో మరీ ముఖ్యంగా శివ భక్తులు బూడిదను ధరిస్తే, విష్ణు భక్తులు నామాన్ని ధరిస్తారు. కానీ ఏదైనా బొట్టు కిందే వ్యవహరించబడుతుంది.
ఇక పెద్దలు ఆశీర్వదిస్తూ కూడా కొన్ని సందర్భాల్లో బొట్టు పెడతారు. ఈ క్రమంలోనే బొట్టు పెట్టుకునేందుకు చాలా మంది కుడిచేతి ఉంగరం వేలునే వాడతారు.
అయితే మీకు తెలుసా.? అదే కాదు. ఇతర వేళ్లతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు. మరి ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం…
హిందూ శాస్త్రాల ప్రకారం మధ్యవేలు శని గ్రహం స్థానం. ఈ గ్రహం మనకు దీర్ఘకాల ఆయుష్షును ఇస్తుంది. కాబట్టి ఈ వేలుతో బొట్టుపెట్టుకున్న వారికి ఆయుష్షు పెరుగుతుంది.
ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే ఆ వేలు స్థానం సూర్యునిది. ఆయన మనకు మానసిక శాంతిని కలిగిస్తాడు. కాబట్టి ఆ వేలుతో బొట్టు పెట్టుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సూర్యునిలో ఉన్న శక్తి మనకు లభిస్తుంది. విజ్ఞానవంతులుగా తయారవుతారు.
బొటనవేలితో బొట్టు పెట్టుకున్న వారికి శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయి. ఎందుకంటే ఆ వేలు స్థానం శుక్రునిది. ఆయన మనకు కొండంత బలాన్నిస్తాడు. విజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాడు
చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మోక్షం లభిస్తుంది. ఆ వేలు స్థానం గురువుది. ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మోక్షం కలిగిస్తాడు. సమస్యల నుంచి బయట పడేస్తాడు.
మన శరీరంలో మొత్తం 13 స్థానాల్లో బొట్టు పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది నుదుటిపైనే బొట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్థానం అంగారకుడిది. ఆయనకు ఎరుపు అంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బొట్టును చాలా మంది పెట్టుకుంటారు.