Written By : Dinakar
ఒకటి రెండు కాదు, ఏకంగా 63 రోజులు టైఫాయిడ్ జ్వరం.ఇక బతకడు కిందకు దించండి అని ఎవరో అన్నారు కూడా!(మంచం నుండి).
అంతకు ముందే తన స్వంత ఇంటిని అప్పులు వాళ్ళు వేలంపాటలో అమ్మేశారు. చనిపోయిన వాళ్ళ అమ్మ స్వయంగా పునాదులు తవ్వి, రాళ్ళు మోసి కట్టుకున్న ఇల్లు అది. పెంచిన తల్లి కుడా 14 ఏళ్లకే చనిపోయింది. మెడకు రాయి కట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, తోడుగా పెరిగిన తమ్ముడు…
ఇలా ఎన్ని జరిగినా ఆయనకు మాత్రం కన్నీటికి బదులుగా కవిత్వమే వచ్చేది. బహుశా,
కన్నీరే అయన కలంలో సిరా లాగా ప్రవహించి కవిత్వమై బయటకి వచ్చి గర్జించేదేమో.
20 శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని అంతా రెండు అక్షరాలలో పేర్చితే అవి ‘శ్రీశ్రీ ‘ లుగా మిగులుతాయి. అప్పటిదాకా వచ్చిన సాంప్రదాయపు గణబద్ధఛందస్సులకు, ఉపమాన అలంకారాలకు ఆయన కవిత్వం లొంగలేదు. కళా నిబంధనలకు అతీతమైనది ఆ కవిత్వం. అలా అని ఆయన వ్రాయలేక కాదు, 8 ఏళ్లకే కందపద్యం, 10 ఏళ్లకే నవల, 18 ఏళ్లకే ఖండకావ్యం రాసిన వాడికి, ఇవి రాయటం పెద్ద విశేషం కాదని చెప్పనవసరం లేదు. కవిత్వం రాయాల్సింది మెప్పు కోసం కాదు, మేల్కొలుపు కోసం అని , ‘శ్రీశ్రీ’ అనే రెండు అక్షరాలు శంఖారావం, డంఖాధ్వానం చేశాయి.
పేదవాడి ఆకలి, కార్మికుడి కష్టం, నిరుద్యోగి అసహనం, సైనికుడి తెగింపు కలగలిసిన విప్లవం అయన కవిత్వం.
“నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను”
“ఆకాశ దారుల వెంటా హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథ చక్రాలను భూమార్గం పట్టిస్తానని”
“మంటల చేత మాట్లాడించి, రక్తం చేత రాగాలాపన చేయిస్తానంటూ”
నిలువెత్తు మనిషి గొంతెత్తి గర్జిస్తుంటే,
నిండు సభలో దిక్కులు పెక్కటిల్లేలా కరతాళాధ్వనులు మ్రోగుతుండగా, తెలుగు వారంతా ముక్త కంఠంతో “మహాకవి” అని పిలిచారు ఆయన్ని. విమర్శలు చేసిన వారి తోటే పురస్కారాలు అందుకున్నాడు. రాళ్ళు రువ్విన చోటు నుండే పూలు చల్లించుకున్నాడు తనపైన.
“అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం”. అని మరోసారి నిరూపించుకున్నాడు.
1910 ఏప్రిల్ 30వ తేది సూర్యోదయం వేళ ఉదయించిన శ్రీశ్రీ. 1983 జూన్ 15వ తేదీన సూర్యాస్తమయం వేళ అస్తమించాడు. తను చనిపోయిన తర్వాత తన శవం మీద ఎర్ర జెండా కప్పడం మర్చిపోవద్దని మరీ మరీ అభ్యర్ధించాడు.
ఓ శ్రీశ్రీ ,
ఎవరో కవి చెప్పినట్టు..
నువ్వో సత్తెనివి నీకు చావు లేదు,
నువ్వో సూరీడువి నీకు చీకటి లేదు.
మాలో అఖండ రుధిరజ్యోతివై వెలిగే నీకు..
అక్షరభాష్పాంజలి ఘటిస్తూ..
పాదభివందనలతో.