మృకండు మహర్షి యొక్క పుత్రుడు మార్కండేయుడు. శివ వరప్రసాదిగా జన్మించి భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని ఆరాధించి మృత్యువు కోరలనుంచి బయటపడిన భక్తవరేణ్యుడు మార్కండేయుడు. శివ పురాణంలోని మార్కండేయ చరిత్ర పఠిస్తే అపమృత్యువు బాధ తొలగుతుందని ప్రజల నమ్మకం. మరి మనిషి సంతోషకరమైన జీవితానికి మార్కాండేయ మహర్షి చెప్పిన మూడు మార్గాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్కాండేయ మహర్షి కథ విషయానికి వస్తే, మృకండ మహర్షి, మరుద్వతి దంపతులు. సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేస్తారు. ఈశ్వరుడు ప్రత్యక్షమై దుర్మార్గుడైన దీర్ఘాయుష్మంతుడినైనా లేక సన్మార్గుడైన అల్పాయుష్కుడునైనా పుత్రునిగా కోరుకొమ్మంటాడు. అప్పుడు మృకండ మహర్షి సన్మార్గుడైన అల్పాయుష్కుడే కావాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు పదహారేళ్లు మాత్రమే జీవించే కుమారుని అనుగ్రహిస్తాడు. ఈ రహస్యం మృకండుడు తన భార్యకు తెలియనివ్వడు. మార్కండేయునిగా నామకరణం చేయబడిన ఆ బాలుడు చిన్ననాటి నుంచి ఈశ్వరారాధనలో కాలం గడుపుతుంటాడు. కుమారునికి ఉపనయన సమయంలో మృకండ మహర్షి అతనికి బ్రహ్మోపదేశం చేస్తాడు. మార్కండేయుడు ఒంటరిగా అరణ్యానికి వెళ్లి, ఒక సెలయేరు పక్కనే మట్టితో శివలింగాన్ని చేసి, ప్రతిరోజూ పూజిస్తూ శివధ్యానంలో మునిగిపోతాడు. మార్కండేయుడి దీక్షకు ఆశ్చర్యపడి నారద మహర్షి, శివపంచాక్షరిని ఉపదేశిస్తాడు. సుమారు 11 సంవత్సరాలు ఏకాగ్రతతో, తదేకథ్యానంతో శివమంత్రాన్ని జపిస్తాడు. ఆ రోజు 16 సంవత్సరాల వయస్సు పూర్తికావస్తుంది. శివభక్తుడు కావడంతో, అతని ప్రాణాలు తీయడానికి సాక్షాత్తు యముడే మార్కండేయుడు ఉన్న చోటికి వస్తాడు. యమధర్మరాజు వచ్చి అతనిపై పాశం ప్రయోగిస్తాడు. శివలింగం నుండి ఈశ్వరుడు ఉద్భవించి యముని దండించి మార్కండేయుని రక్షిస్తాడు. దేవతల వేడికోలుతో యమధర్మరాజును బ్రతికించి, మార్కండేయుని చిరంజీవిగా వర్ధిల్లమని వరం ఇస్తాడు. ఇక మహా మ్రుత్యుంజయడు అయినా మార్కండేయుడిని ఆధారంగా సుఖవంతమైన జీవితాన్ని పొందడానికి మూడు మార్గాలు ఏంటంటే…సాత్వికత:
ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనని పెంపొందించుకునే మార్గమే సాత్వికత. నియమం నిబద్ధతని ఇస్తుంది. ఆ నిబద్ధత లక్ష్యం దిశగా ఉండే మీ మార్గాన్ని సుగమం చేస్తుంది. నియమమైన ఆహారం శరీరానికి ఆరోగ్యాన్నిస్తే. ధ్యానం, దానం మనసుకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం:పుణ్యక్షేత్ర దర్శనం, అక్కడి పుణ్య నదులలో స్నానం, కనిపించే భక్తి, వినిపించే ప్రార్థనలు మనలో కొత్త శక్తిని కలిగిస్తాయి. మతం ఏదయినా గానీ మనలో పాజిటివ్ థింకింగ్ ను పెంపొందిస్తుంది. సరైన స్నేహం:నీ స్నేహితులే నీ వ్యక్తిత్వం. నువ్వు నీ స్నేహితులతో గడిపే సమయమే నీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఉరకలేసే ఉత్సాహం, పాజిటివ్ ద్రుక్పథం ఉన్న స్నేహితులు ఎలా అయితే నీలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతారో. నెగిటివ్ ఆలోచనలు, నిర్లిప్తత, నిరుత్సాహంలో ఉండే వ్యక్తులు నిన్ను కూడా తెలియని దుఃఖంలో కూరుకుపోయేలా చేయగలరు. మహా మ్రుత్యుంజయ మంత్రాన్ని మనకీ అందించిన మహర్షి మార్కండేయ చూపించిన జీవిత మార్గాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు.