చిత్రత్రగుప్తుడు అంటే మనకి యమధర్మరాజు దగ్గర మనుషుల చిట్టా రాసె వాడిగానే తెలుసు. అసలు చిత్రగుప్తుడు ఎవరు అయన జన్మ రహస్యం ఏంటి, మనుషుల పాప,పుణ్య విషయాలు ఆయనే ఎందుకు రాసేవాడు, ఆయనకి దేవుడిలా ఆలయాన్ని దేనికి నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రములోని కాంచీపురం జిల్లా లో ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది. అయితే పాప పుణ్యాల చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవరికి ఉండదు. ఎందుకంటే మనుషులు భౌతికంగా చేసిన పాపాలనే కాకుండా, మనసుతో చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగినవాడు చిత్ర గుప్తుడు. మనం ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి శిలా రూపం. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడు పాపం చేయకుండా ధర్మమార్గంలో జీవించాలనే ఆలోచన ఎవరికైనా తప్పక కలుగుతుంది. ఇక ఈ స్థల పురాణానికి వస్తే, ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి పాపులకు శిక్షలు విధించే క్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన గణకుడిని ప్రసాదించమని కోరాడు. యముడి కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా, యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయినా సూర్యనారాయణుడే తీర్చగలడని బ్రహ్మకు అనిపించింది. ప్రపంచానికంతటికి వెలుగును ప్రసాదించే ప్రభాకరుడు ఒకరోజున ఆకాశమార్గాన తన ఏకచక్ర రధంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మ సంకల్పంతో మార్తాండుని మనసులోకి మదనుడు ప్రవేశించాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై ప్రసరించి ఏడు రంగులతో కూడిన ఒక అందమైన ఇంద్రధనస్సు ఉధ్బవించింది. అది చూసి భానుడు పులకరించి పోయి ఇటువంటి ఇంద్రచాపం లాంటి ఒక సౌందర్యవతి స్త్రీ రూపం ధరిస్తే ఎంతో బాగుండును అని మనసులో అనుకోగా, బ్రహ్మ సంకల్పంతో ఆ ఇంద్రధనస్సు కాస్త అపూర్వ సౌందర్యవతిగా మారిపోయింది. అప్పుడు బ్రహ్మ యొక్క అనుమతితో సూర్యుడు ఆమెకు నీలాదేవి అనే నామకరణంతో అర్దాంగిగా స్వీకరించాడు. సూర్యుడు, నీలాదేవిలకు కొంతలానికి చైత్రపూర్ణిమ రోజున వారికీ ఒక కుమారుడు కలిగాడు. పుడుతూనే ఆ బాలుని ఎడమచేతిలో పుస్తకం, కుడిచేతిలో కలం ఉన్నట్లు రేకలు కనిపించాయట. అందుకే ఆ బాలునికి ‘చిత్ర పుత్రుడు’ అని నామకరణం చేసారు. అతడే చిత్రగుప్తుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అయితే చిత్రగుప్తుడికి ముగ్గురు బ్రాహ్మల కుమార్తలతో వివాహం జరిగింది. అందులో శివంశంతో జన్మించిన దేవా శిల్పి మయబ్రహ్మ కుమార్తె ప్రభావతి, మనుబ్రహ్మ కుమార్తె నీలావతి, విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికాదేవి. ఇది ఇలా ఉంటె 1910 వ సంవత్సరంలో కంచి ఆలయ తవ్వకాలలో ఈ విగ్రహం లభించింది. పంచలోహాలతో రూపొందించబడ్డ శ్రీ కర్ణికా దేవి సమేతంగా చిత్రగుప్తుని ఉత్సవ విగ్రహం కంచి ఆలయంలో దర్శనమిస్తుంది. వరుసగా చైత్ర పౌర్ణమి నుండి అయిదు పౌర్ణమిలు చిత్రగుప్తునికి అర్చన చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.