Home Unknown facts పురుహూతికా దేవి ఆలయ విశేషాలు ఏంటో తెలుసా ?

పురుహూతికా దేవి ఆలయ విశేషాలు ఏంటో తెలుసా ?

0

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, పూజిస్తున్నాం. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (గుడి ధ్వంసం అయ్యింది), మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. అందులో ఒకటి ఆంధ్రాలో ఉంది ఆ శక్తిపీఠం విశేషాలు తెలుసుకుందాం.

పురుహూతికా దేవిఆంధ్రలో ఈశాన్యం దిక్కుగా తూర్పుగోదావరి జిల్లా వుంది. పచ్చనిపైరులు, గలగలా పారుతున్న పంట కాలువలు, ఉధృతంగా ప్రవహించే గోదావరినది మరియు సముద్రతీర ప్రాంతాలతో కనులవిందుగా జిల్లా దర్శినమిస్తుంది. సముద్రం, గోదావరి నది కలిసే ప్రదేశానికి అతిసమీపంలో నున్న ప్రాచీన పట్టణం ”కాకినాడ పట్టణం”. తూర్పు కోస్తా ప్రాంతపు రేవులలో కాకినాడ రేవు ప్రాచీనమైనది. పిఠాపురం సంస్థానాదీశులు కాకినాడ పట్టణాన్ని ప్రణాళికాబద్ధమైన రీతిలో తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణానికి ఉత్తరదిశవైపుగా సుమారు 19 కి.మీ. దూరంలో పిఠాపురం అనే చిన్న పట్టణం వుంది. ఇది చుట్టుప్రక్కల ప్రాంతాలకు ముఖ్య కేంద్రం.

పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం. నాటి మహారాజుల భవనాలు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. వీటితోపాటు శ్రీపురుహూతిక పీఠం కూడ కాలగర్భంలో కలిసిపోయింది. సతీదేవి యొక్క పీఠభాగం (పిరుదులు) పడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ప్రాచీనకాలంలో శ్రీపీఠంగా, పురుహూతికాపురంగా, పురుహూతికా పట్టణంగా వాడుకలో వుండేది. అష్టాదశ శక్తి పీఠములలో పదవపీఠం అయిన శ్రీ పురుహూతికా మూలస్థానం శ్రీ కుక్కుటేశ్వరాలయ ప్రాంగణంలో ఈశాన్యం వైపుగా వుంది. గర్భగుడిలో అమ్మవారు శాంతి రూపంలో దర్శనమిస్తుంది.

శ్రీ పురుహూతికాదేవిని ఇంద్రుడు మున్ముందుగా ఆరాధించారు. పురుహూతికా దేవి పూర్వం ఇంద్రునిచే పూజింపబడింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమమహర్షి భార్య అయిన అహల్యాదేవిని గౌతమమహర్షి రూపం ధరించి మోసగిస్తాడు. దానికి ప్రతిఫలంగా మహర్షి శాపం వల్ల ఇంద్రుడు తన బీజాలను కోల్పోయి శరీరం అంతా యోని ముద్రలు పొందుతాడు. దానికి బాధపడిన ఇంద్రుడు గౌతమ మహర్షిని ప్రార్ధిస్తాడు. ఆ ప్రార్ధనల వల్ల గౌతమమహర్షి కనికరించి ఆ యోని ముద్రలు కన్నులు లాగ కనిపిస్తాయని చెపుతాడు. అప్పటినుంచి ఇంద్రుడు సహస్రాక్షుడు అని పేరు పొందుతాడు. కాని ఇంద్రుడుకి బీజాలు పోయాయి. వాటిని తిరిగి పొందటానికి ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి జగన్మాత కోసం తపస్సు చేస్తాడు. చాలాకాలం తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడికి సంపదను, బీజాలను ప్రసాదిస్తుంది. అప్పటినుంచి ఇంద్రుడుచే పూజింపబడటం వల్ల అమ్మవారిని పురుహూతికా అని పిలుస్తున్నారు.

గయాసురుడు కూడ ఆరాధించిన శక్తిగా అమ్మవారు ప్రసిద్ధి చెందింది. అమ్మవారి మందిరం 1995 సంవత్సరంలో జీర్ణోద్ధరణ జరిగింది. 1998 సంవత్సరం లో ఆలయ పునర్నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. అమ్మవారికి నిత్యపూజలు జరుగుతుంటాయి. కుంకుమార్చనలు మొదలగునవి భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. అమ్మవారి మంటపంలో నాలుగు ప్రక్కల, గర్భగుడి గోడల మీద అష్టాదశ శక్తి పీఠాలను పొందుపరిచారు. ఆశ్వీజమాసంలో దేవి నవరాత్య్రుత్సవాలు ఘనంగా జరుగుతాయి. విజయదశమినాడు జమ్మి ఉత్సవం వైభవంగా జరుగుతుంది.

పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రాచీన పుణ్యతీర్ధాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వరుడు స్వయంభూలింగముగా వెలిసారు. పిఠాపురం కాశీతో సమానమైనది. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. శ్రీ వ్యాసభగవానులు సతీసమేతంగా కాశీనగరం విడిచి, దక్షిణకాశీ అయిన పిఠాపురంలో పాదగయ తీర్ధంలో స్నానం చేసి, శ్రీహుంకారిణి సహిత శ్రీకుక్కుటేశ్వరుని దర్శించుకున్నారు.

శ్రీ అగస్త్యులు కూడా సతీసమేతంగా ద్వాదశ క్షేత్రయాత్ర జరుపుతూ భూమండలంలో శ్రీ కుక్కుటేశ్వరస్వామిని మరియు శ్రీ పురుహూతికాదేవిని కొలిచారు. 14వ శతాబ్దం వాడైన శ్రీనాథకవి సార్వభౌముడు తన కావ్యంలో ఈ క్షేత్రం గురించి పీఠికాపురం, పీఠాపట్టణము మరియు పిఠాపురంగా వర్ణించాడు. శ్రీకుక్కుటేశ్వరక్షేత్రం కాశీ, కేదార, కోణార్క, కుంభకోణాలకు సాటైనా మోక్షదాయమని వర్ణించాడు. ఇక్కడ జరిపే దానం, హోమం, అధ్యయనం, శ్రాద్ధం, దేవతార్చనలు, వ్రతాలు మొదలగునవి కోటి రెట్లు ఫలితన్ని ఇస్తాయని భీమేశ్వరపురాణంలో వివరించాడు. కుక్కుటేశ్వర శతకం అనే కావ్యమును శ్రీకూచిమంచి తిమ్మకవి స్వామివారికి అంకితమిచ్చాడు.

 

Exit mobile version