Home Unknown facts దేవాలయాలను ఏ సమయంలో దర్శించడం మంచిదో తెలుసా

దేవాలయాలను ఏ సమయంలో దర్శించడం మంచిదో తెలుసా

0

శుభకార్యాల్లో, జన్మదినం సందర్బంగా ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. ఎక్కువగా ఉదయాన్నే దైవదర్శనం శుభప్రదమైనదని మనందరికీ తెలిసిన విషయమే. దేవాలయాలను దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది, కోరికలు నెరవేరుతాయి. అయితే శాస్త్ర ప్రకారం సూచించిన సమయాలలో దేవాలయాలను దర్శించడం వల్ల అధిక ఫలితాన్ని పొందవచ్చు. స్థితి కారుడైన శ్రీమహావిష్ణువు ఆలయాన్ని, శ్రీ రాముని, ఆంజనేయుని ఆలయాలని లేదా ఏ వైష్ణవ ఆలయాన్నైనా ఉదయాన్నే దర్శించుకోవాలి. నిత్య జీవనంలో మనకు ఎదురయే అనేక ఆపదలను బాపే శ్రీమన్నారాయణుని ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా దర్శించుకోవడం అత్యంత శుభం. లయకారకుడు, ధ్యానమూర్తి అయిన శంకరుడిని ఆయన అనుచర గణాలనూ రాత్రివేళ లేదా సాయం సమయాలలో దర్శించాలి.

Templesపరమ శివుడు మనస్సుకు అధిపతి, జగద్గురువు. అటువంటి శివుణ్ణి చంద్రుడు వచ్చిన తరువాత దర్శించుకోవడం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది. దీనికి కారణం చంద్ర కిరణాలు మానవుని శరీరంలో రక్తప్రసరణ పై (బి.పి.) నేరుగా ప్రభావం చూపుతాయి. చంద్రుడు ఆకాశంలో ఉండగా బుద్ధికి మనసుకూ అధిపతి అయిన శంకరుని ధ్యానించడం వల్ల చంద్ర కాంతి మన మనసుపై మంచి ప్రభావాన్ని చూపి, ఏకాగ్రత,జ్ఞాపక శక్తి, బుద్ధికుశలత పెరుగుతాయి. వైష్ణవ ఆలయాలు, శైవ ఆలయాల వాలే అమ్మవారి ఆలయాలను దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఉండదు. ఆమె త్రిలోకాలకూ అమ్మ కాబట్టి అమ్మను ఏ వేళలో అయినా దర్శించవచ్చు, ధ్యానించవచ్చు.

ఏ దేవాలయానికి వెళ్లినా దేవుడికి నమస్కరించడం మన సాంప్రదాయం. మన భారతీయ సంస్కృతి యొక్క మహత్తు అపారమైనది. ఈ సంస్కృతిలో ఆదికాలం నుంచీ వస్తున్న సాంప్రదాయాల వెనుక గొప్ప తాత్త్విక, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. భారతీయ సంస్కృతి యొక్క అపురూప రత్నము నమస్కారం. నమస్కారానికి అర్థము వందనము. నమస్సు లేక ప్రణామము. మన సంస్కృతిలో నమస్కారానికి ఒక స్థానం, మహత్తు ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతియందు కరచాలనం (షేక్‌ హ్యాండ్‌) చేసుకున్నట్టుగానే భారతీయ సంస్కృతిలో రెండు చేతులూ జోడించి, తలను వంచి ప్రణమిల్లే ప్రాచీన పద్ధతి ఉంది. దీన్ని కరెక్టుగా చెప్పాలంటే సంస్కారంతో కూడిన నమస్కారం అనాలి. నమస్కారం అనేది ఒక ఉత్తమ సాంప్రదాయం.

మనకంటే పెద్దలను, మాతా పితృలను, గురువులను, సాధువులను, సజ్జన, మహాత్ములను, ఉత్తములను కలుసుకున్న సమయంలో వారి ఎదుట చేతులు జోడించి, తలను వంచినట్లయితే మనలో ఉండే అహంకారం నశించి, అంత:కరణము నిర్మలమై వినయము అలవడుతుంది. ఆడంబరాలు, ఆర్భాటాలు, డాంబికాలు పోయి సరళ స్వభావులుగా, సాత్వి కులుగా మారతాము. మనస్ఫూర్తిగా చేసిన నమస్కారమే పైన చెప్పిన విధంగా సంస్కారంతో కూడిన నమస్కారం అవుతుంది. రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా ఆనించి, శిరస్సు వంచి చేసే నమస్కారము సరైన పద్ధతిలో చేసే నమస్కారము. ఈ నమస్కారానికి జేజే, దండం, అంజలి వంటి పర్యాయ పదాలుగా చెప్పుకునే పేర్లు కూడా ఉన్నాయి. దేవుడి ముందు నిలబడి చేసే నమస్కారం శ్రేష్ఠమైనది. రెండు చేతులూ జోడించటం చేత జీవన శక్తిని, తేజో వలయాన్ని రక్షించే ఒక చక్రం ఏర్పడుతుంది. ఆ వందనం విశేష లాభదాయకమైనది.

ఇక వందనము చందనము వాలే శీతలమైనది. వందనం వల్ల వినయము, శాంతి, ఉత్తమతత్వం సిద్ధిస్తాయి. ఆలోచనలలో సంయమనాన్ని, ప్రవృత్తికి నియంత్రణనూ, విశ్వాసాన్ని పొందగలం. ఉత్తమ వ్యక్తిత్త్వం అలవడుతుంది. మనం చేసే పనిని అనుసరించి మన విలువ ఉంటుంది. సమాజంలో తరతరాల నుంచి పిల్లలకు పెద్దలు పద్ధతులను, సాంప్రదాయాలను, మర్యాదలను, కట్టుబాట్లను, నియమాలను వినయ విధేయతలను నేర్పిస్తూ, వివరిస్తూ మన సంస్కృతి విశిష్టతను, వార సత్వంగా అందిస్తున్నారు.

తరువాతి తరాల వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు. నమస్కారం భారతీయ సాంప్రదాయమై తరతరాల నుంచి వస్తుంది. ఎదుటి వారికి, పెద్దలకు నమస్కారం చేయటం ద్వారా వారి పట్ల మనకున్న గౌరవ మర్యాదలను, వినయ విధేయతలను, భక్తి, శ్రద్ధలను తెలుపవచ్చు. తప్పును మన్నించమని అడగటాన్ని, వేడుకోవటాన్ని నమస్కారం తెలుపుతుంది. మన నమస్కారానికి ఎదుటి వారు చేసే నమస్కారాన్ని ప్రతి నమస్కారం అంటాము. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం మన సంస్కారాన్ని తెలుపుతుంది.

 

Exit mobile version