Home Unknown facts గోదానం చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందా ?

గోదానం చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందా ?

0

మన పురాణాలు, శాస్త్రాలు ఎన్నో రకాల దానాల గురించి వాటి వలన కలిగే పుణ్యకర్మల గురించి వివరిస్తున్నాయి. ఒక్కో దానంతో ఒక్కోరకమైన సత్ఫలితం లభిస్తున్నప్పటికీ అన్ని దానాల్లోకి గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అంతటి విశిష్టత కలిగిన గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు.

గోదానంకొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. కానీ అప్పటికే నది పొంగడంతో అవి న‌దీ గర్భంలో కలిసిపోయాయి. తరువాత నదీ తీరానికి చేరుకున్న నాచికేతుడికి అవి కనిపించలేదు. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శ‌పించాడు.

తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని చెప్పి నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. ఆ మరుసటి రోజు సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు. నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు.

ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చ‌నిపొమ్మ‌ని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్న‌ట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

 

Exit mobile version