Home Unknown facts అష్టాదశ పురాణాలూ అంటే ఏమిటి ? అవి ఎలా వచ్చాయి

అష్టాదశ పురాణాలూ అంటే ఏమిటి ? అవి ఎలా వచ్చాయి

0

అష్టాదశ పురాణాలూ అంటే 18 పురాణాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం.

మత్స్య పురాణము :

మత్స్య పురాణముదీనిలో 1400 శ్లోకములు ఉంటాయి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనుషులకు బోధింప బడింది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడ్డాయి.

మార్కండేయ పురాణము :

ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడింది. శివవిష్ణువుల మహత్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి.

భాగవత పురాణము:

దీనిలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి.

భవిష్య పురాణము :

దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందులో తెలుపబడినది.

బ్రహ్మపురాణము :

దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అంటారు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గురించి వివరించబడినవి.

బ్రహ్మండ పురాణము :

దీనిలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందులో ఉంటుంది.

బ్రహ్మ వైవర్త పురాణము :

దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి ఉంటుంది.

వరాహ పురాణము :

దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతార మెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు. పుణ్యక్షేత్రవర్ణనలు ఈ పురాణములో ఉన్నాయి.

వామన పురాణము :

దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ఋతు వర్ణనలు వివరించబడి ఉన్నాయి.

వాయు పురాణము :

దీనిలో 24,000 శ్లోకములు ఉన్నాయి. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.

విష్ణు పురాణము :

ఇందులో 23,000 శ్లోకములు ఉన్నాయి. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహత్మ్యము, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.

అగ్ని పురాణము :

దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.

నారద పురాణము :

ఇందులో 25,000 శ్లోకములు ఉన్నాయి. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివస్తోత్రము) ఇందులో ఉంది . వేదాంగములు, వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందులో కలవు.

స్కంద పురాణము :

దీనిలో 81,000 శ్లోకములు ఉన్నాయి. ఇది కుమారస్వామి (స్కందుడు)చే చెప్పబడినది. ఇందులో ముక్యంగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, మొదలగునవి కలవు.

లింగ పురాణము :

ఇది శివుని ఉపదేశాలు, లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతోపాటు వ్రతములు. ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.

గరుడ పురాణము :

ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహవిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినది.

కూర్మ పురాణము :

ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నరసింహావతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.

పద్మపురాణము :

ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్ధసారం – పఠనమహత్మ్యం, గంగామహత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహత్మ్యం, పూజావిధులు – విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలుయజేయబడింది.

 

Exit mobile version