మన దేశంలో మతాలకి అతీతంగా అందరు వెళ్లే దేవాలయాలు, చర్చులు, దర్గాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇలా మతాలకి అతీతంగా అన్ని మతాల వారు వచ్చే వాటిలో ఈ దర్గా ఒకటిగా చెబుతారు. ఈ దర్గాని స్థానికులు పెద్ద దర్గా అని పిలుచుకుంటారు. సర్వ రోగాలను నయం చేసే శక్తి ఈ దర్గాకి ఉందని ఇక్కడ ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం. మరి ఈ దర్గా ఎక్కడ ఉంది? ఈ దర్గా విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా లో అతిపవిత్రమైన అమీన్ పీర్ దర్గా ఉంది. ఇది చాలా పురాతనమైన దర్గా అని చెబుతారు. ఇక్కడికి అన్ని మతాలకి అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం ఈ దర్గాని సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ దుర్గ కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ దర్గాలోని సాహెబ్ (స్వామి) ను నమ్ముకొని ప్రార్ధించి దర్గా విభూతి తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు నివారించబడతాయని భక్తుల నమ్మకం.
ఇక ఈ దర్గా ప్రాగణంలో 18 మజార్ లు ఉన్నవి. ఇచట సంవత్సరంలో నెల నెలా గంధం, ఉరుసు ఉత్సవాలు గొప్పగా జరుగుతుంటాయి. అందులో 5 దర్గాలకు చెందిన మజార్ లకు మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ మార్చి నెలలో జరిగే ఉరుసు గొప్పగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ముంబాయి, కలకత్తా, చెన్నై మైసూరు మొదలగు ప్రాంతాల నుండి పండితులు, విద్వాంసులు, శిష్యకోటితో ఈ ఉత్సవాలలో పాల్గొంటారు. ఇక ఈ దర్గా విషయానికి వస్తే, దైవస్వరూపులైన మహమ్మద్ ప్రవర్త వంశీయులు ఆస్తానే – యే – ముగ్దుమ్ ఇలాహి ప్రధమ సూఫీ హజ్రత్ ఖ్వాజ సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుస్సుని చిస్తివుల్ ఖాద్రి నాయబ్ – యే – రసూత్ సాహెబ్ గారు కర్ణాటక ప్రాంతంలోని బీదర్ నుంచి బయలుదేరి కడపలో అయన పవిత్రపాదం మోపారు. ఆయన చాలా నిరాడంబరులు, దైవాంశ సంభూతులు, వీరు కడపలో నివసించినన్ని రోజులు ప్రజలతో మమేకమై వారిని భక్తి మార్గంలో నడిపించుటకు ఎంతో కృషి చేసారు. ఎన్నో మహిమలు చూపారు. అచటనే ఒక దర్గా నిర్మించారు. దీనినే పెద్ద దర్గా అని పిలుస్తారు. ఈ దైవాంశ సంభూతుడు 1761 లో అమీర్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు. తన ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు అరీఫుల్లా హుసేని కడప పీఠాధిపతిగా, మరో కుమారుడు నదులూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఇప్పటికి వరకు ఇక్కడ 11 మంది పీఠాధిపతులు కొనసాగారు. పీఠాధిపతుల సూచనల మేరకు అక్కడున్న తీర్థం సేవిస్తే సర్వరోగాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉరుసులో మహమ్మదీయ భక్తులతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా అధికసంఖ్యలో పాల్గొంటారు.