Home Unknown facts ఏయే దేవాలయాల్లో, ఏ దేవుడి ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా ?

ఏయే దేవాలయాల్లో, ఏ దేవుడి ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా ?

0

నిత్యజీవితంలో ఏ బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం కావాలన్న, గ్రహదోషాలు పోవాలన్నా మొదట చేసేది దేవాలయ ప్రదక్షిణలే. ఈ ప్రదక్షిణలను ఆయా సమస్యలు, కోర్కెలను బట్టి ఆయా దేవాలయాల్లో పండితులు చెప్పిన విధంగా ఆచరించడం జరుగుతుంది. సాధారణంగా ప్రదక్షిణలు ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి తిరిగి అక్కడికె చేరుకొని దైవానికి నమస్కరిస్తారు. దాన్ని ఒక ప్రదక్షిణగా పరిగణిస్తారు. ఏ దేవాలయమైన ఇలా కనీసం మూడు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలువేదాంత పరంగా మొదటి ప్రదక్షిణలో మనషులు తమలోని తమోగుణాన్ని వదిలివేయాలి. రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలి వేయాలి మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలి వేయాలి. తర్వాత దేవాయలంలోకి వెళ్లి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించుకోవాలి. అనేది అసలు పరమార్థం. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా ఆత్మ ప్రదక్షిణ చేయడం తప్పనిసరి.

ఇప్పుడు ఏయే దేవాలయాల్లో, ఏ దేవుడి ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసుకుందాం…ఏ దేవాలయంలోనైనా కనీసం మూడు తప్పనిసరిగా చేయాలి. నవగ్రహాలకు కనీసం మూడు. దోషాలు పోవడానికి కనీసం తొమ్మిది. ఒకవేళ ప్రదక్షిణం చేసేవారి జాతక లేదా గోచార పరంగా ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.

ఆంజనేయస్వామి దేవాలయంలో సాధారణంగా మూడు చేయాలి. గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9/11, భయం, రోగం, పీడలు, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21/40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వరప్రదక్షిణ చేయాలి. ఇక అమ్మవారి దేవాలయంలో కనీసం మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. వేంకటేశ్వరస్వామి లేదా బాబా, గణపతి దేవాలయాల్లో కనీసం మూడు గాని ఐదు గాని, తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి.

అయితే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రదక్షిణ చేసే సమయంలో మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతునిమీద మాత్రమే తప్ప ఇతరత్రా విషయాలపై ఉండకూడదు. సాధరణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతోనే దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు వేగంగా, పరుగు పరుగున చేయకూడదు. నెమ్మదిగా ఆ దేవాలయంలో ఉన్న మూల విరాట్ నామస్మరణతో పక్కవారిని తాకకుండా, ముచ్చట్లు పెట్టకుండా ప్రదక్షిణలు చేయాలి.

Exit mobile version