Home Unknown facts తిరుమలలో అనంతాళ్వార్ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చెట్టుకి బంధించాడా?

తిరుమలలో అనంతాళ్వార్ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చెట్టుకి బంధించాడా?

0

రామానుజుల గారి శిష్యుడు అనంతాళ్వార్. రామానుజుల గారి కోరిక మేరకు అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమలలో నివసించేవాడు. అయితే  శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండమీద స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు. మరి అనంతాళ్వార్ శ్రీ మహాలక్ష్మిని చెట్టుకి ఎందుకు బంధించాడు? చివరకు నిజాన్ని తెలుసుకొని ఏం చేసాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

mahalakshmiపూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందకి వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుమల లోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరు కూడా సాహసించేవారు కాదు. అందుకే ఆలయాన్ని సూర్యోదయం తరువాతే తెరిచేవారు. ఆ సమయంలో రామానుజుల గారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు. ఈవిధంగా స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాళ్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూల తోట నిర్మించాలనుకున్నాడు. అంతేకాకుండా పూల మొక్కలకి నీటి కోసం ఒక బావిని తవ్వాలని భావించి గర్భంతో ఉన్న అతడి భార్యని సహాయం చేయమని కోరాడు. అయితే అనంతాళ్వార్ మట్టిని తవ్వి ఆ మట్టిని తట్టలో వేసి ఇస్తే ఆ మట్టిని దూరంగా పోసి వస్తుండగా, అది చూసిన స్వామివారిని ఆమెకి సహాయం చేయాలని తలచి బాలుని రూపంలో వచ్చి మట్టి ఎత్తడానికి సహాయం చేస్తానని చెప్పగా దానికి అనంతాళ్వార్ అంగీకరించలేదు. ఆ సమయంలో అతడి భార్యని మీకు సహాయం చేస్తానని అడుగగా ఆమె దానికి ఒప్పుకుంటుంది.

ఇలా అనంతాళ్వార్ మట్టిని తన భార్య ఇంత వేగంగా ఎలా పోసి వస్తుందని అనుమానం వచ్చి చూడగా ఆమెకి ఆ బాలుడు సహాయం చేయడం చూసి కోపంతో తన చేతిలో ఉన్న గునపాన్ని ఆ బాలుడి పైకి విసిరివేస్తాడు. అప్పుడు ఆ బాలుడి గడ్డానికి గునపం తగిలి రక్తం కారాగా ఆ బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బావిని తవ్వుతూ సాయంత్రం స్వామివారి సేవకు అనంతాళ్వార్ వెళ్లగా స్వామివారి గడ్డం దగ్గర నుండి రక్తం కారడం చూసి, నేను గునపాన్ని విసిరింది సాక్ష్యాత్తు శ్రీనివాసుడి మీదనే అని తన తప్పు తెలుసుకొని వెంటనే తన చేతిలో ఉన్న కర్పూరాన్ని స్వామివారి గడ్డానికి పెట్టడంతో రక్తం కారడం ఆగిపోతుంది. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయి ఇప్పటికి స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు.

ఇది ఇలా ఉంటె, అనంతాళ్వార్ పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతి రోజు స్వామివారికి సమర్పించేవారు. ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు. అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్దుడై తానూ ధరించే పుష్ప మాలలే ఇంత సుందరంగా ఉండే ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు. ఇలా తోటలో స్వామివారు పూల సుహాసనని చూస్తూ, పూలని కోస్తూ , అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు. అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతాళ్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు, స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడి, ఆ దొంగలని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా  తోటకి కాపలా ఉన్నాడు. కానీ స్వామివారు అనంతాళ్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేవారు. ఇలా 8 రోజులు జరుగుతూనే ఉండగా, అనంతాళ్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్లి, స్వామి ఎవరో కన్ను గప్పి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారి ప్రార్ధించగా, అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని, ఆచార్య భక్తిని లోకాని తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు.

ఇక అనంతాళ్వార్ తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా, ఒక పొద దగ్గర ఎదో శబ్దం వినిపించింది. అటుగా వెళ్లి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాళ్వార్ చూడటానికి రాజా కుటుంబానికి చెందిన వారీగా ఉన్నారు అని తలచి, తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారు, ఎవరు మీరు అంటూ వెళ్లి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్లగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది. అప్పుడు అనంతాళ్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు. అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతాళ్వార్ కి దొరకకుండా మాయమవుతాడు. అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారు జామున వెతుకుదాం అని నిద్రపోతాడు.

ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు. అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అప్పుడు స్వామివారు అర్చకులరా అమ్మవారు అనంతాళ్వార్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్లి విడిపించి సగోర్వముగా తీసుకొనిరండి అంటూ పలకడంతో, అర్చకులు తోటలో వెళ్లి, ఎంతటి అదృష్టవంతుడవయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అనగా, జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టంగా నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి  తీసుకొనివచ్చాడు. ఈవిధంగా అమంవారిని తీసుకువచ్చిన అనంతాళ్వార్ ని శ్రీవారు మామ అని పలుకుతూ, నీ కూతురిని పూలబుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యాదాతవైనా మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారు వక్షస్థలానికి చేరుకుంది.

ఆనాడు జరిగిన ఈ దివ్యగాథ గుర్తుగా నేటికీ ప్రతి సంవత్సరం అదే రోజున అంటే కన్యమాసంలో జరిగే బ్రహ్మోత్సవంలో గజారోహణ మరునాడు ఆలయం అప్రదిక్షణంగా శ్రీవారి బాక్సావారి ఉత్సవం ఉంటుంది. బాగ్ అంటే తోట అని అర్ధం. ఈ ఉత్సవం అప్పుడు స్వామివారు ఒక్కరే ఆలయానికి అప్రదిక్షణంగా ఊరేగుతూ అనంతాళ్వార్ తోటకు వచ్చి పూజలను అందుకుంటాడు. పూజ అనంతరం స్వామివారు అప్రదక్షణంగానే మిగిలిన ఊరేగింపు పూర్తి చేసుకొని ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈవిధంగా తిరుమల శ్రీవారిని, అమ్మవారిని దర్శనం చేసుకున్న గొప్ప భక్తుడు శ్రీ అనంతాళ్వార్.

Exit mobile version