Home Unknown facts నిమిషాదేవి ప్రత్యేకత మరియు ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా ?

నిమిషాదేవి ప్రత్యేకత మరియు ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా ?

0

భక్తి, ఆధ్యాత్మిక చింతన కలిగిన మనుషులు ఉండే దేశం కాబట్టే ఊరికొక ఆలయం ఉంది. కొంతమంది మన హిందూ సంస్కృతి సాంప్రాదాయాలను చిన్న చూపు చూస్తారు. కానీ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప సాంప్రదాయాలు మనవి. చెట్టును, పుట్టను రాయిని, పర్వతాన్ని పంచభూతాలలో ఉండే ప్రతిదాన్ని పూజించే ఆచారాలు మనవి. కొంతమందికి మూఢనమ్మకాలుగా కనిపించినా ప్రతిదాని వెనుక ఏదో ఒక ఆంతర్యం తప్పకుండ ఉంటుంది. మన సనాతన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే.

Nimishambika Devi Templeఅయితే దేవుడి ఆలయాలతో పాటు దేవతల ఆలయాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ గ్రామ దేవతలు కొలువై ఉండి విశేష పూజలు అందుకుంటున్నారు. గ్రామదేవతలు గ్రామాలను కాపాడుతారని ప్రజల విశ్వాసం. దుష్ట శక్తులను హాని కలిగించే వ్యాధులను ఊరిలోకి రాకుండా కాపలాకాస్తూ ఊరిని కాపాడుతుందని నమ్ముతారు. ఈ విధంగా అమ్మవారి ఆలయాలలోకెల్లా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినదే నిమిషాంబిక ఆలయం. అయితే ఈ దేవి యొక్క ప్రత్యేకత ఏమిటి ?ఆలయ విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినపుడు కోరికలు కోరుకుంటాం. కష్టాలు తీరాలి, శుభాలు జరగాలి అని ముడుపులు కూడా కడుతుంటారు కొంతమంది. అయితే మన నమ్మకం నిస్వార్ధంగా ఉంటే కొన్నిసార్లు కోరికలు నెరవేరుతాయి. అయితే మనం కోరిన కోరికలు నెరవేరడానికి కొంత సమయం పడుతుంది అనే విషయం అందరికి తెలుసు. కానీ నిమిషా దేవి ఆలయంలో ఏవైనా కోరికలు కోరుకుంటే నిమిషాల్లో తీరుతాయట!

కర్ణాటకలోని శ్రీరంగపట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం గ్రామంలో ఈ ఆలయం ఉంది.పురాణాల ప్రకారం ముక్తకుడు అనే రుషి లోక కల్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టారు. ఆ యాగం జరిగితే రాక్షసులు అంతమవుతారని భావించి ఎలాగైనా యజ్ఞ భంగం చేయాలని రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ రాక్షసులను అంతమొందించడానికి చాలా ప్రయత్నాలు చేసారు ఋషులు.

ఈ విధంగా ముక్తక ఋషి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ రాక్షసుల ఆగడాలను అంతమొందించ లేకపోయాడు. ఆసమయంలో పార్వతీదేవి యజ్ఞ కుండంలో నుంచి ఉద్భవించి రాక్షసులను సంహరించగా అప్పటినుంచి అక్కడ ఉన్న పార్వతీ దేవిని నిమిషా దేవిగా పిలుస్తారు.ఒడయార్లనే రాజులు శ్రీ రంగపట్నంను రాజధానిగా చేసుకొని పాలన సాగించగా 400 సంవత్సరాల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు,శ్రీ చక్రాన్ని కూడా పూజిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి గాజులు, నిమ్మకాయలను సమర్పిస్తారు. ఈ విధంగా సమర్పించి ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నిమిషాల్లో తీరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయలను ఇంటిలో ఉంచుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని భావిస్తారు. ఈ ఆలయ దర్శనార్థం ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు.

 

Exit mobile version