కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం… వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.
శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీ దేవతకు ఉసిరి అంటే ఎంతో ప్రీతికరం. వీరి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి. అయితే అమ్మ వారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున ఉసిరి దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.
తద్వారా ఈతిబాధలు వుండవు. పూజ అనంతరం అమ్మవారికి అష్టోత్తరం చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఉసిరి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరనీ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.