Home Unknown facts చేతిలో త్రిశూలం, ఢమరుకంతో దర్శనమిచ్చే అమ్మవారు వెలసిన అరుదైన ఆలయం

చేతిలో త్రిశూలం, ఢమరుకంతో దర్శనమిచ్చే అమ్మవారు వెలసిన అరుదైన ఆలయం

0

ఈ గ్రామంలో వెలసిన అమ్మవారు అక్కడి ప్రజలకి కరుణామయిగా, కల్పవల్లిగా ప్రసిద్ధిచెందింది. అంతేకాకుండా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. శివపార్వతుల కుమార్తె అయినా పోచమ్మ చల్లంగా చూసే చక్కని తల్లిగా మహా శక్తి గా ఇక్కడ పూజలందుకుంటోంది. మరి శివశక్తి స్వరూపిణిగా అమ్మవారు ఇక్కడ ఎందుకు వెలిశారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shivudi aalayamనిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం అడెల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయం వెలసింది. ఏకశిలపై కొలువుతీరిన అమ్మవారు చేతిలో త్రిశూలం, ఢమరుకంతో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శివశక్తి స్వరూపిణి అయిన పోచమ్మ తనతోపాటు ఆరుగురు అక్కచెల్లెళ్లతో కలసి పూజలందుకుంటోంది. శివపార్వతుల ఏడుగురు కుమార్తెలయిన బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు గర్భగుడిలో ఉన్నాయి. ఇలాంటివి దేశంలో మరెక్కడా ఉండవని వేద పండితులు చెబుతున్నారు. పరశురాముడు ఈ ప్రాంతంలో పర్యటించాడనీ, అప్పుడే పోచమ్మ గద్దెను ఏర్పాటు చేశాడనీ చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఎంతో శక్తిగల పోచమ్మ తనను నమ్మిన వారిని చల్లంగా చూస్తుందనేది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అడెల్లి మహా పోచమ్మ ఆలయం భక్తుల తాకిడితో ప్రతి ఆదివారం జాతరను తలపిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల పచ్చదనాన్ని పానుపులుగా చేసుకున్నట్లుండే ఆలయ పరిసర ప్రాంతాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి.


స్థలపురాణం ప్రకారం, పూర్వం అడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించి తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యాల బారిన పడి ప్రజలు చనిపోవడం వల్ల వూళ్లకు వూళ్లే శ్మశానాలుగా మారిపోయాయి. దిక్కు తోచని ప్రజలు తమను కాపాడమని శివుడిని ప్రార్థించారు. భక్తుల మొరను ఆలకించిన ఆయన ఈ ప్రాంతానికి రక్షకురాలిగా తన కుమార్తె అయిన పోచమ్మను పంపించాడు. తండ్రి ఆదేశాలతో భువికి చేరుకున్న పోచమ్మ ప్రజలకు అండగా నిలిచింది. సమృద్ధిగా వానలు కురిపించి కరవును రూపుమాపింది. అప్పటినుంచీ అమ్మవారు భక్తులు కోరినకోర్కెలు తీరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని ఇక్కడి భక్తుల విశ్వాసం.

ఈ ఆలయంలో శక్తిస్వరూపిణికి “గంగ” నీళ్ల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. నవరాత్రులకు ముందు గంగనీళ్ల జాతరను చేస్తారు. దసరాకు ముందు వచ్చే అంటే అమావాస్య తర్వాత శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బాజాభజంత్రీలూ, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలనూ తీసుకుని సాంగ్వీ సమీపంలోని గోదావరి తీరానికి చేరుకుంటారు.

సారంగాపూర్‌, యాకర్‌పల్లి, గొడిసెర, వంజర్‌, ప్యారమూర్‌, కదిలి, దిలావార్‌పూర్‌, కంజర్‌ గ్రామాల మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి, ఆదివారం వేకువ జామున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేస్తారు. ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకుని సాయంత్రాని కల్లా తిరిగి ఆలయానికి చేరుకుంటారు. మార్గమధ్యంలో వూరూరా ప్రజలు అమ్మవారి ఆభరణాలకు మంగళహారతులు సమర్పిస్తారు. స్థానిక కోనేటి నీటిని గోదావరి నీటిలో కలిపి పోచమ్మ విగ్రహాన్ని అభిషేకించి, ఆభరణాలను అలంకరిస్తారు. ఈ క్రతువుతో జాతర ముగుస్తుంది. భక్తులు కూడా ప్రత్యేక పాత్రలతో గోదారి నీటిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పంటలు బాగా పండాలన్న ఉద్దేశంతో మిగిలిన నీటిని తమ పంట పొలాల్లో చల్లుకుంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరలో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల భక్తులూ అధిక సంఖ్యలో పాల్గొంటారు.

ఇలా వెలసిన శివశక్తి స్వరూపుని అయినా పోచమ్మ తల్లి కోరిన కోర్కెలు తీరుస్తూ తమని చల్లగా చూస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.

Exit mobile version