మండోదరి రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కూతురు. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. ఈమె దేవకన్యయైన హేమకు మయబ్రహ్మకు కలిగిన పుత్రిక . ఈమె తల్లి హేమ అనబడే దేవకన్య. మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. కాబట్టి తండ్రియైన మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు. ఈమె రావణాసురుని పట్టమహిషి. మిక్కిలి సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే కాదు మండోదరి అంతర్ స్సౌందర్యం కూడా కొనియాడదగినది. నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం ఈమెది. శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మనవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారాజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి.