Home Unknown facts మత్స్యావతారంలో వెలిసిన గోవిందుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?

మత్స్యావతారంలో వెలిసిన గోవిందుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?

0

పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిల్లో మొదటిదీ.. వేదాలకు పునర్జన్మను ప్రసాదించిందీ మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం ఒకటి ఉంది… ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది.. ఈ ఆలయ విశేషాలేంటి ఇప్పుడు తెల్సుకుందాం..

matsya avatarmమనిషి పుట్టుక నుంచీ మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.

మరోవైపు… వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్ని రోజులకీ ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమ్మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఈ వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం. ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో 23, 24, 25 తేదీలలో లేదా 26,27,28 తేదీలలో మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుతుండటం విశేషం..

Exit mobile version