Home Unknown facts నల్లరాతి హంసపై పంచముఖాలతో దర్శనమిచ్చే అమ్మవారి అరుదైన ఆలయం

నల్లరాతి హంసపై పంచముఖాలతో దర్శనమిచ్చే అమ్మవారి అరుదైన ఆలయం

0

ఇక్కడ వెలసిన ఈ అమ్మవారు పంచముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మరి ఈ అమ్మవారు వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. gayatrideviతెలంగాణ రాష్ట్రంలోని, హైదరాబాద్ లోని బి. హెచ్. ఈ. ఎల్ కి 4 కి.మీ. దూరంలో విద్యుత్ నగర్ కాలనిలో శ్రీ పంచముఖ గాయత్రీ దేవి ఆలయం ఉన్నది. ఈ గాయత్రీ క్షేత్రం వివిధ ఆలయాల సమూహంగా వెలుగొందుచున్నది. ఇక్కడ కొలువై ఉన్న ఇతర దేవతామూర్తులు కూడా పంచముఖాలు కలిగి ఉండుట ఒక విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి వాహనమైన నల్లరాతి హంస భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ హంస స్వచ్ఛతకు ప్రతీకగా చెబుతారు. గర్భాలయంలో కొలువై ఉన్న పంచముఖ గాయత్రీ అమ్మవారు బంగారు, ఇంద్రనీల, వజ్ర, ధవళ వర్ణాలతో ప్రతి ముఖానికి మూడేసి కళ్ళు కలిగిన పంచముఖాలు, చంద్రవంకతో శోభిల్లే కిరీటం, వరద, అభయ ముద్రతో అంకుశం, కొరడా శుభ్ర కపాలం, గద, శంఖం, చక్ర ఆయుధాలు ధరించి, ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయంలోని శ్రీ చక్రానికి భక్తులు నిత్యమూ శ్రీ చక్ర పూజలు, కుంకుమ పూజలు చేస్తారు. కుంకుమ పూజలు నిర్వహించే మహిళలకు సౌభాగ్య సిద్ది కలుగుతుందని వారి నమ్మకం. గాయత్రీ మంతాన్ని మొట్టమొదటిసారిగా లోకాలకు తెలియచేసిన తపశ్శాలి విశ్వామిత్రుడు. ఆ మంత్రాన్ని నిర్గుణోపాసన ద్వారా సాధించిన మహనీయుడు వశిష్ఠుడు. అందుకే ఈ ఇరువురు మహర్షులు గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ధ్యానముద్రలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి కుడివైపు భాగంలో ఉన్న ఆలయంలో నల్లరాతి పంచముఖ ఆదిశేషు లక్ష్మి గణపతి కొలువుదీరి ఉన్నాడు. అమ్మవారికి ఎడమవైపున భాగాన పంచాయతన సహిత శ్రీ పంచముఖ ఉపమహేశ్వరస్వామి ఆలయం ఉన్నది. స్వామికి ఎదురుగా, ధ్వజస్తంభం, నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ కొలువై ఉన్న శివుడు సద్యోజాత, వాసుదేవ, ఈశాన, సత్పురుష, అఘోర అనే పంచ ముఖాలతో విలసిల్లుతున్నాడు. గాయత్రీ మాత ఆలయ ప్రాంగణంలో దక్షిణ భాగంలో పంచముఖ ఆంజనేయస్వామి, నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, ఆంజనేయుడు మొదలగు పంచరూపాలతో కొలువుదీరాడు. ఈ ఆలయ ప్రాగణంలో దక్షిణభాగంలో నవగ్రహ మండపం, ఆలయానికి సమీపంలో గోశాల ఉంది. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిది అలంకరణలు, హోమములు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, లలితా పారాయణలు, భక్తుకమ్మల పూజలు ఘనంగా జరుగుతాయి. ఇలా వివిధ ఆలయాల సమూహంగా వెలసిన ఈ పంచముఖ దేవాలయానికి భక్తుల ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version