Home Unknown facts ఏకపీఠంపై దర్శనమిచ్చే జలధీశ్వరస్వామి ఆలయ రహస్యాలు

ఏకపీఠంపై దర్శనమిచ్చే జలధీశ్వరస్వామి ఆలయ రహస్యాలు

0

మన దేశంలో కొన్ని వేలసంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు దర్శనమిస్తుంటాయి. అందుకే భారతదేశాన్ని ధైవభూమిగా పిలుస్తుంటారు. ప్రాచీన ఘనత, ఆధ్యాత్మిక వైభవం కలిగిన పుణ్యక్షేత్రాలు, మనసును ప్రశాంత నిలయంగా మార్చి ముక్తి మార్గంలో నడిపిస్తుంటాయి. ఆ ఆలయాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ మనసుని ప్రశాంతపరిచేలా ఆలయ నిర్మాణాలు ఉంటాయి. అలాంటి విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ‘జలధీశ్వరస్వామి క్షేత్రం’ ఒకటిగా కనిపిస్తుంది. జలధీశ్వర ఆలయానికి సుమారు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది.

Secrets of Jaladheeshwaraswamy Templeఎంతో ప్రాచీనమైన ఈ క్షేత్రం కృష్ణా జిల్లా ‘ఘంటసాల’లో దర్శనమిస్తుంది. సిద్ధార్థుడు తనకెంతో ఇష్టమైన ‘ఘంటక’ మనే అశ్వం చనిపోగా, దాని పేరున ఇక్కడ ఒక స్థూపాన్ని ప్రతిష్ఠించాడనీ, కాలక్రమంలో అదే ‘ఘంటసాల’ గా మారిందని శాసనాల వలన తెలుస్తోంది. ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రముఖ రేవుపట్టణంగా ఉండేది. వేల సంవత్సరాల క్రితమే స్వామి ఇక్కడ పార్వతీ సమేతుడై కొలువై వుండగా, క్రీ.శ.2 వ శతాబ్దంలో ఈ క్షేత్రం వెలుగులోకి వచ్చినట్టు ఆధారాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని చోళ పాండ్యపురం అని పిలిచేవారట. మొదటి వేయి సంవత్సరాలు ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించారు.

ఇక్కడున్న జలనిధిని ఈశ్వరుడిగా భావించి జలధీశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. పాలలాటి సున్నపురాతితో ఈ లింగాన్ని రూపొందించారని చెవుతారు. ఇక్కడి మూల విరాట్టు శ్వేతలింగంగా భక్తులకు దర్శనమిస్తాడు. ప్రాచీన వైభవానికి అద్దంపడుతోన్న ఈ క్షేత్రంలో, గర్భాలయంలో స్వామివారు, అమ్మవారు ఏక పీఠంపై కొలువుదీరి వుంటారు. సాధారణంగా శివాయాల్లో గర్భాలయంలో ఎదురుగా శివుడు ఒక పక్క అమ్మవారూ దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఒకే పీఠం మీద ఆది దంపతులిద్దరు పూజందుకోవడం విశేషం. ఈ కారణంగానే దీనిని అర్థనారీశ్వర పీఠమని పేర్కొంటూ వుంటారు.

ఆదిదంపతుల ఆదేశం మేరకే అగస్త్య మహర్షి ఇక్కడ వారిని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. పూర్వం దక్షుని కుమార్తె అయిన సతీదేవి అగ్నికి ఆహుతైన అనంతరం హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించింది. పరమశివుడినే భర్తగా పొందాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేసింది. పార్వతి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ఆమె భక్తినీ సంకల్పాన్ని పరిపరివిధాల పరీక్షించిన తరువాత వివాహం చేసుకున్నాడు. హిమవంతుని అనుమతితో ఉత్తర పథాన జరుగుతున్న వివాహ మహోత్సవాన్ని వీక్షించేందుకు దేవతలోపాటు సమస్త ప్రాణికోటి అటువైపు చేరుకుంది. దీంతో బరువంతా ఒకవైపు పెరిగి భూమాత కొంత ఒరిగిపోయింది.

దీన్ని గమనించిన మహాశివుడు అగస్త్య మహామునిని పిలిచి వెంటనే దక్షిణా పథానికి వెళ్లి ఒక చక్కటి ప్రదేశంలో ఆలుమగలమైన తామిద్దర్ని ప్రతిష్టించి, భక్తిశ్రద్ధలతో పూజిస్తే తమ కల్యాణాన్ని దర్శించే భాగ్యం కలుగుతుందని చెప్పాడు. పరమేశ్వరుడి ఆజ్ఞతో దక్షిణా పథానికి బయలుదేరిన ఆగస్త్యుడు సముద్రం ఒడ్డున శివపార్వతులిద్దరినీ ప్రతిష్టించాలని భావించాడు. ఘంటసాల ప్రాంతానికి చేరుకుని ఆ పరమేశ్వరుని ధ్యానించినంతనే శ్వేతలింగాకారుడై చెంతన పరమేశ్వరితో ఏకపీఠం మీద ఉద్భవించాడు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించడం వలన, అష్టాదశ శక్తి పీఠాలను, ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం లభిస్తుందని అంటారు.

ఇక్కడ స్వామివారి అభిషేక తీర్థం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు.ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ఆది దంపతుల ఆశీస్సులను అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ క్షేత్రంలోని విమాన శిఖరం ఇతర ఆలయాలకు భిన్నంగా మూడు శిఖరాలతో అలరారుతూ ఉంటుంది. ఆలయానికి ఎదురుగా గోపురం, మూడువైపులా ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఆలయ మహామండపానికి ఇరువైపులా పల్నాటి సున్నపురాయితో చెక్కిన భైరవుడు, నరసింహస్వామి విగ్రహాలున్నాయి.

నరసింహస్వామి క్షేత్ర పాలకునిగాను, భైరవుడు ద్వారపాలకునిగాను ఉండటం ఆ ఆలయంలో మరో ప్రత్యేకత. ఇక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం మొహంజొదారో కాలానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతారు. సరస్వతీమాత, మరికొందరు దేవతామూర్తుల విగ్రహాలు మనలను భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ఘంటసాలలో ఇంకా వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాంబ ఆలయం, భావనారుషి ఆలయం, రామాలయం, పెన్నేరమ్మ, ముత్యాలమ్మలకు కూడా దేవాలయాలు ఉన్నాయి.

Exit mobile version