ప్రపంచంలో ఉన్న ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. దీని ప్రకారం.. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. శివుడు లయకారుడు. ధర్మం, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు. అదే గరుడ పురాణం. స్వర్గానికి ఎవరెళ్తారు, నరకానికి ఎవరెళ్తారు అని గరుడ పక్షి విష్ణు మూర్తిని ప్రశ్నించగా.. ఎవరైతే మంచి పనులకు దూరంగా, ఎప్పుడు చెడ్డపనులే చేస్తుంటారో వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణువు చెప్పాడు.
గరుడ పురాణం కేవలం మనుషులకు విధించే శిక్షలను తెలియజేస్తుందని, మనుషులు చేసిన పాపాలకు మరణాంతరం ఎలాంటి బాధలను అనుభవించాలనే విషయాల గురించి ఉంటుందని అందుకోసమే ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చాలా మంది చెబుతుంటారు. అదేవిధంగా నాగ దేవతలను పూజించే వారు గరుడ పురాణాన్ని చదవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతారు.
ఎందుకంటే గరుడ పురాణం అనేది కేవలం శిక్షలను మాత్రమే తెలియజేస్తుంది కానీ ఆ పుస్తకం ఒక దుష్టశక్తుల నిలయం కాదు. మనకు కావాల్సిన ఎంతో విలువైన సమాచారాన్ని ఈ గరుడ పురాణం అందిస్తుంది.