శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలు మనకి తెలుసు. అయితే విష్ణు పురాణం ప్రకారం ఇది కూడా శ్రీమహావిష్ణువు యొక్క 21 అవతారాలు అని చెప్పబడే అవతారాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. మరి ఆ స్వామి ఎలా వెలిశారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలం, చింతలూరు అనే గ్రామంలో శ్రీ ధన్వంతరి స్వామి వారి ఆలయం ఉంది. విష్ణుపురాణం లో ఉన్నదాని ప్రకారం, శ్రీమహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో ధన్వంతరి అవతారం ఒకటి.
ఇక పురాణానికి వస్తే, క్షిరసాగర మథన సమయంలో ప్రపంచ మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు శ్రీ మహావిష్ణువే స్వయంగా ధన్వంతరి స్వామిగా ఆవిర్భవించాడు. ఆయుర్వేద వైద్య శాస్రానికి అధిదేవత శ్రీ ధన్వంతరి స్వామి కాబట్టి హిందూ ఆయుర్వేదం ధన్వంతరి మూర్తిని గొప్ప దైవంగా ఆరాధిస్తుంది. ఈ ఆలయంలోని స్వామివారిని సేవిస్తే దీర్ఘరోగాలు కూడా మటుమాయమై సంపూర్ణ ఆరోగ్యం పొందగలరని భక్తుల గట్టి నమ్మకం.
ఈ ఆలయ విషయానికి వస్తే, గర్భాలయంలో స్వామివారు చతుర్భుజుడు. స్వామి యొక్క కుడిచేతి యందు జలచరమైన నల్లటి జలగను మనం చూడగలం. ఈ జలచరము రోగి యొక్క శరీరం నందలి మాలిన రక్తం పీల్చి, తిరిగి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే శ్రీ నూకాంబిక దేవాలయం కూడా ఉంది.
ఈవిధంగా వెలసిన ఈ స్వామివారికి ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు జయంతి ఉత్సవాలు, మాఘశుద్ధ దశమి నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం, మార్గశిరమాసం నందు సుబ్రమణ్య షష్టి మొదలగు ఉత్సవాలు ఘనంగా నిర్బహిస్తారు.