Home Unknown facts సుబ్రహ్మణ్యస్వామి వారి దేహం సర్పంవలె పొలుసులతో దర్సనమిచ్చే ఆలయం

సుబ్రహ్మణ్యస్వామి వారి దేహం సర్పంవలె పొలుసులతో దర్సనమిచ్చే ఆలయం

0

పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు కుమారస్వామి, భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించి, నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ.. లింగాకారంలోనూ.. పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలువై ఉంటారు. ఐతే.. అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభువుమూర్తి కనిపించే క్షేత్రం ఒకటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఈ క్షేత్ర విశేషాలేంటో ఇపుడు తెల్సుకుందాం..

Subramanya swamyసుబ్రహ్మణ్యస్వామి మహిమలను గురించి కథలు కథలుగా చెప్పుకునే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో విరాజిల్లుతోంది. అదే ‘అత్తిలి’ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తి బయటపడిన తీరును ఇక్కడ వారు ఆసక్తికరంగా చెబుతుంటారు. మరో విశేషం ఏమిటంటే రోజూ గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట్‌ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు. ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో గానీ, చెరువు గట్టుపై గానీ కుబుసం విడిచి వెళ్తుందని, దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

చాలాకాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది.. ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు. కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా, గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది.. అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ వుంటుంది.

స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత.. అత్తిలి సుబ్రహ్మణ్యస్వామి అభిషేక ప్రియుడు. ప్రతీ మంగళవారం, నెల షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు, ప్రత్యే పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. నాగ, కుజ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు. సంతానం లేని వారు నాగుల చీర, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం కలిగాక తలనీలాలు, పటికిబెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారు. అత్తిలిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామి దర్శనం చేసుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి. మొదట్లో అత్రి అన్న పదమే తరవాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం.

స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు కథనం.. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం..

Exit mobile version