Home Unknown facts విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుని చరిత్ర గురించి తెలుసా ?

విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుని చరిత్ర గురించి తెలుసా ?

0

విద్య యశస్సు. విద్య సకలాన్ని ప్రసాదిస్తుంది. విద్య ఉంటే ఏలాగైనా బతుకవచ్చు. ఇక్కడ విద్య అంటే కేవలం మనం ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్ విద్య మాత్రమే కాదు. అన్ని రకాల విద్యలు. ఈ విద్య రావడానికి ఆరాధించాల్సిన దేవుడు హయగ్రీవస్వామి. విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుని చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

History of Hayagrivaపూర్వం గుర్రపుతల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు ఆదిశక్తిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని మరేదైనా వరం కోరుకోమని జగన్మాత చెబుతుంది. అప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు.

అలాగే ఆ రాక్షసుడిని అనుగ్రహించి పరాశక్తి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు.

ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు.

బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి నిర్వహిస్తారు. ఈ స్వామిని ఆరాధిస్తే సకల విద్యలు కరతలామాలకం అవుతాయని పురాణాల్లో ఉంది.

 

Exit mobile version