Home Unknown facts కర్ణుడికి, అర్జునుడికి మధ్య ఉన్న తేడా గురించి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు?

కర్ణుడికి, అర్జునుడికి మధ్య ఉన్న తేడా గురించి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు?

0

మహాభారతంలో కర్ణుడు, అర్జునుడు ఒకరిని మించిన వారు మరొకరిని చెప్పవచ్చు. యుద్ధరంగంలో సాటిలేని ఈ వీరులకి గుణం విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. దానం చేయడంలో కర్ణుడిని మించిన వారు లేరు. ఎందుకంటే అయన నోటి నుండి లేదు అనే మాట రాదని చెబుతారు. మరి కర్ణుడికి, అర్జునుడికి మధ్య ఉన్న తేడా గురించి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? అర్జునుడు శ్రీకృష్ణుడిని ఏమని అడిగాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Karnuduకర్ణుడు కౌరవుల పక్షాన ఉండటం వలన అర్జునుడికి, కర్ణుడికి మధ్య వ్యక్తిగతమైన వైరం ఉండేది.కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేకపోయేవాడు. ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి బావా నేను కూడా దానాలు చేశాను. అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు. అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు. దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు.

అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఆ తరువాత ఇద్దరు కలసి వాహ్యాళికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి ఈ బంగారు కొండను దానం చేయి. అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అన్నాడు. అప్పుడు అర్జునుడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు. అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు. ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయి కృష్ణా దానం చేయాలంటే చిరాకుగా ఉంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు దానం ఎలా చేయాలో తెలుసుకో అని చెప్పి కర్ణుడిని పిలిపించి ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది అన్నాడు. అప్పుడు వెంటనే కర్ణుడు అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి అన్నాడు. అందరూ తమకు కావల్సిన మేరకు బంగారం తీసుకెళ్లారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది. అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు. కానీ కర్ణుడికి ఆశ లేదు. అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు. దానం చేసేవారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు. అప్పుడే ఆ దానం ఫలిస్తుంది అని బోధ చేశాడు.

 

Exit mobile version