Home Unknown facts యమధర్మ రాజు శివుని పక్కన ఎందుకు వెలిశాడో తెలుసా ?

యమధర్మ రాజు శివుని పక్కన ఎందుకు వెలిశాడో తెలుసా ?

0

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రెండు శివలింగాలు ఒకే గర్భగుడిలో ఉండటమే కాళేశ్వరం ప్రత్యేకత. అవునా! అని ఆశ్చర్య పడకండి ఇది నిజమే. కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). కనుకనే ఈ ఆలయానికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, అని పేరు వచ్చింది.

Mukteshwara Swamiఆలయ స్థల పురాణం :

మొదట ఇక్కడ శివుడు మాత్రమే కొలువై ఉండేవాడు. దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మ రాజు కి పనిలేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్ళి వేడుకోగా … శివుడు యమున్ని తనవద్దే పక్కన లింగరూపంలో నిల్చోమన్నాడట. తనని దర్శించుకున్న వారు అతనిని దర్శించుకోనట్లయితే మోక్షప్రాప్తి లభించదని అన్నాడు. అలాంటి వారికి కాలం దగ్గరపడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని (శివుణ్ని), కాళేశ్వరుణ్ణి (యమున్ని) కూడా దర్శించుకుంటారు.

ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషమైతే ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో వెళ్ళి కలుస్తుందంటారు.

కాళేశ్వరం క్షేత్రం గొప్ప శిల్పకళానిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పకాళాఖండాల వల్ల పూర్వవైభవం తేటతెల్లమవుతున్నది. దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయం ఇక్కడ చూడవలసిన మరొక ప్రధాన ఆలయం. అలాగే ఇక్కడ సూర్యదేవాలయం కూడా చూడవచ్చు. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్‌ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం వంటి తీర్థాలున్నాయి.

కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. ఆలయంలో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెల్లినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇందులో నుండి వెళ్లుటానికి దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.

కాళేశ్వరంలో ఇంకా శ్రీ శుభానంద ఆలయం, రాముల వారి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సంగమేశ్వర ఆలయం, సుబ్రమణ్య స్వామి ఆలయం, విజయ గణపతి ఆలయం, గోదావరి మాత ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం, నాగ దేవత ఆలయం చూడవచ్చు.

పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉంది ఈ కాళేశ్వర పుణ్యక్షేత్రం. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసింది ఈ క్షేత్రం.

 

Exit mobile version