Home Unknown facts ఆరు ముఖాలతో కూడిన స్వామిగా కొలిచే సుబ్రమణ్యేశ్వరుడి జన్మం ఎలా జరిగిందో తెలుసా ?

ఆరు ముఖాలతో కూడిన స్వామిగా కొలిచే సుబ్రమణ్యేశ్వరుడి జన్మం ఎలా జరిగిందో తెలుసా ?

0

శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరుడి జన్మం ఎలా జరిగిందో తెలుసుకుందాం..

subramanyeswara swamyదక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించి, తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందుతారు.

వర గర్వంతో ఆ రాక్షసులు ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు.

ఆ కాంతి ప్రవాహంలో వెళ్ళి గంగానదిలోని రెల్లు పొదల మధ్య చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. ఈ విషయం తెలిసిన పార్వతి ‘స్కందా’ అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. ఆ దివ్యమూర్తే కుమారస్వామి.

కుమారస్వామికి ఇతర నామాలు కూడా ఉన్నాయి.

  • షణ్ముఖుడు అనగా ఆరు ముఖాలు కలవాడు.
  • స్కందుడు అనేది పార్వతీదేవి పిలిచిన పేరు.
  • కృత్తికానక్షత్రాన జన్మించినందుకు కార్తికేయుడు.
  • శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు గనుక వేలాయుధుడు .
  • శరవణం (రెల్లు వనం) లో జన్మించాడు కాబట్టి శరవణుడు .
  • దేవతలకు సేనాధిపతి కావున సేనాపతి.
  • శివునికే ప్రణవ మంత్ర అర్ధాన్ని చెప్పినాడు కనుక స్వామినాథుడు.
  • బ్రహ్మజ్ఞానం కలిగినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు.

ఇలా ఎదుగుతున్న కార్తికేయుడు కొన్నాళ్లకి తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు. ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి వెళతాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు.

కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.

శూరపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా… శూరపద్ముని కార్తికేయుడు గుర్తించి తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. అప్పుడు నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు.

 

Exit mobile version