Home Unknown facts భగవంతునికి భజన చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటి

భగవంతునికి భజన చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటి

0

భజన అంటే భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు గల అనేక సేవల రూపాలలో ఒకటి. పదిమందీ కలుసుకునే వేదిక. దేవాలయాలలో, ఇతర ప్రార్ధనా స్థలాలలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు.

Mystery Behind Worshiping Godభ:భగవన్నామాన్ని, :జగత్తు అంతా, న:నర్తింపజేయడమే భగవన్నామాన్ని జగత్తు అంతా నర్తింప జేయటమే భజన. భగవంతుడు నువ్వు భజన చేసేటపుడు నీ రాగాన్ని, నీ తాళాన్ని, నీ సంగీత పరిజ్ఞానాన్ని, నీ గాత్ర మాధుర్యాన్ని చూడడు. నీ ఆర్తిని, నీ ఆరాటాన్ని, నీలోని ఆర్ద్రతని, నీ భావాన్ని మాత్రమే చూస్తాడు. నీ భక్తిని మాత్రమే చూస్తాడు. నీ శక్తిని చూడడు. భగవంతుడు వెన్నకన్నా మెత్తనైనవాడు. వెన్న ఎంత మెత్తనిది అయినప్పటికీ అది కరిగి నెయ్యి అవ్వాలంటే చిన్న వేడి అవసరం. కరుణామయుడు, వెన్నకన్నా మెత్తనైన భగవంతుడు, అనుగ్రహం అనే నెయ్యిని మనకి ప్రసాదించాలంటే ఆర్తి, భక్తి అనే వేడిని తగిలించాలి. ఆర్తితోకూడిన భక్తి తాలూకు సాధనమే భజన. మనసుకి నచ్చిన భగవన్నామాన్ని తాళం వేస్తూ రాగంగా ఆలపించటమే భజన.

మానవ దేహమనే మర్రి చెట్టు కొమ్మలమీద కామ క్రోధ లోభ మోహ, లోభ మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గాలనే పక్షులు కూచుంటాయి. మనసుని కల్లోల పరుస్తుంటాయి. మనిషిని అరుపులు శబ్దాలతో పీడిస్తుంటాయి. అపుడు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, తాళాలతో తాళం వేస్తూ రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, గొంతార గానం చేస్తే, ఆ గుడికి, భగవన్నామ ప్రభావానికి మనలో వాలిన అరిషడ్వర్గాలనే పక్షులు ఎగిరిపోతాయి. అదీ భజన విశిష్టత భగవత్ గాన విశేషత. అయితే ఒకాయనకి ఓ సందేహం వచ్చి పడింది. మనమీంచి ఎగిరిపోయిన అరిషడ్వర్గాలనే పక్షులు మళ్లీ ఎక్కడికి వెళ్తాయి అని గురువుని అడిగాడు. ఆ గురువు ఎంతో చమత్కారంగా సమాధానమిచ్చేరు. ‘‘ఆ ఎగిరిపోయిన అరిషడ్వర్గాలు అనే పక్షులు భజనలు చేయని, నామస్మరణ చేయని వాళ్ళ భుజాలమీద వాలతాయి. కాకపోతే నెత్తిన వాల్తాయి’’ అని గమ్మత్తుగా గురువు చెప్పేరు.

భజనకి, నామస్మరణకి వున్న ప్రాముఖ్యాన్ని వివరించే అద్భుతమైన చమక్కుతో కూడుకున్న బోధ అది. భగవత్ సాక్షాత్కారం కోరేవానికి నామస్మరణకు మించిన ఔషధం లేదు. నామస్మరణలో భగవన్నామమే నీ ఊపిరి కావాలి. భగవంతుడినే ఊపిరిగా పీల్చుకోవాలి. ఆ నామంలోనే భగవంతుడ్ని చూడగలగాలి. చూడాలి. నామస్మరణలో ఆ నామామృతగానాన్ని గ్రోలగలగాలి. జీవితమనే మహా మహా సాగరాన్ని దాటడానికి పెద్ద ఓడ అక్కరలేదు. ‘నామస్మరణ’ అనే చిన్న తెప్ప చాలు.

అలసత్వంవల్ల అజ్ఞానమువల్ల, ఐహిక బంధాలవల్ల అట్టడుగున పడిపోయిన ఆధ్యాత్మిక తత్త్వాన్ని పైకి తీసే చిరు ప్రయత్నమే నామస్మరణ. దేవుని నామాన్ని నాలుకమీద, దేవుని రూపాన్ని కనులముందు ఉంచుకొని భగవన్నామస్మరణ చేసే స్థలమే ఓ పుణ్యక్షేత్రమవుతుంది. భగవన్నామం తారాడే పారాడే ప్రతి గృహం పరమాత్మ క్షేత్రమే. ఓ పుణ్యతీర్థమే.భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి. సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.

భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, బీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. దిగుళ్లు దూరమవుతాయి. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

 

Exit mobile version