వివాహ బంధం కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే పెళ్లి చేయడానికి ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. అలాగే… ఇద్దరి జాతకాలు కలిశాయో లేదో చూడటం కూడా.. అనాదిగా వస్తున్న ఆచారం. ఇద్దరి జాతకాలు కలిసిన తర్వాతే పెళ్లి విషయంలో ముందడుగు వేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.
అయితే కొంతమంది మాంగళ్య దోషం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. సంతానం కలగలన్నా..మాంగళ్య దోషం పోవాలన్నా.. అరటిచెట్టుని పూజించాలి..! సీతారాములు కూడా అరటి పూజ చేశారని ప్రతీతి.
మధ్యాహ్నం పూట ఐదుగురు ముత్తయిదువులకు భోజనం పెట్టి.. వారికి దక్షిణ తాంబూలాదులు, ఐదేసి అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి.
అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవ గురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని.. గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటిచెట్టు మాంగల్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు.. అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.