Home Unknown facts శివుడుని కపాలీశ్వరుడు అని ఎందుకు అంటారు ? స్మశానంలో ఎందుకు నివసిస్తాడు

శివుడుని కపాలీశ్వరుడు అని ఎందుకు అంటారు ? స్మశానంలో ఎందుకు నివసిస్తాడు

0

శివ అనే పదానికి శుభం, మంగళకరం, కళ్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.

Lord Shivaఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు. మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం.

ఈ విభూతి మహిమ అమోఘం. ఈ విభూతితోనే అరుంధతి, మృత విప్రుడిని బ్రతికించింది. బూడిద రాశులుగా మారిన కశ్యపాది మహర్షులను వీరభద్రుడు భస్మం చల్లి తిరిగి బ్రతికించాడు. దుర్వాసమహాముని శివుడు ప్రసాదించిన విభూతిని ధరించి, బ్రహ్మ హత్యాపాతకాన్ని నివారించుకున్నాడు. కుంభీపాక నరకంలో పడ్డ పాపాత్ములు, దుర్వాసమహాముని ధరించిన విభూతి రేణువులు పడగానే పుణ్యాత్ములుగా మారిపోయారు.

తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య/భర్త,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు. అప్పటివరకు నావి,నావే అనుకున్న మనిషి “నా”అనుకున్న వాటిని వదిలేస్తాడు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది.. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి దేనికి కూడా చలించవు. ఎవరు ప్రతి కర్మను కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు.

అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైన, ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం. ఆలయంలో ఆడంబరాలు వుంటాయి. పూజా విధానాలు వుంటాయి. కాని శ్మశానంలో ఏమి ఉండవు. కాలుతున్న శవాలు, బూడిద తప్ప. ఆ బూడిదే సత్యం. అందుకే శివుడు ఎప్పుడూ బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం. అందుకే ఆయన నివాసం శ్మశానం.

 

Exit mobile version