మహిళలు పాదాలకు పట్టీలు ధరించడం అన్నది మన భారతీయ సంప్రదాయాల్లో ఒకటి. మన దేశంలో ఉన్న చాలా వర్గాలకు చెందిన మహిళలు కాళ్లకు పట్టీలను ధరిస్తారు. అయితే ఆ పట్టీలు వెండితో చేసినవే అయి ఉంటాయి. మహిళలు వివాహం చేసుకున్న సందర్భంలో కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అదే పట్టీలు అయితే ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పాదాలకు పట్టీలను తొడుగుతారు.
పట్టులంగా, పాపిడిచేను, కాళ్లకు గజ్జెలు పెట్టుకుని పండగపూట పాపాయి ఇల్లంతా సందడి చేస్తే.. సాక్షాత్తు లక్ష్మీదేవి ఘల్లు ఘల్లుమని గజ్జెల సవ్వడి చేసుకుంటూ నడిచి వస్తున్నట్లు ఉంటుంది. ఇంతకు ముందు వెండిపట్టీలు, నిండైన గజ్జెలతో దర్శనమిచ్చేవి. రాను రాను ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ మారింది. సన్నగా, నైస్గా, నాజూగ్గా ఉన్న పట్టీలు వచ్చి కాలేజీ అమ్మాయిల కాళ్లకు వన్నె తెస్తున్నాయి. వెండి పట్టీల స్థానంలో బంగారం పట్టీలు, పూసల పట్టీలు రకరకాల పట్టీలు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి.
అయితే ఎన్ని రకాల పట్టీలు వచ్చినా వెండి పట్టీలు కాళ్ళకు ధరిస్తేనే మంచివని అంటున్నారు పండితులతో పాటు పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు కూడా. కానీ నేటి తరుణంలో చాలా మంది బంగారంతో చేసిన పట్టీలను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయడం సరికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల పరంగా కూడా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం.. బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమట. బంగారం కూడా పసుపు రంగులోనే మెరిసి పోతుంటుంది. శ్రీ మహా లక్ష్మికి ప్రీతిపాత్రమైన పుత్తడితో పట్టీలు చేయించుకుని కాళ్లకు ధరిస్తే ఆమెను అవమానించినట్లవుతుందని పండితులు అంటున్నారు.
ఇక సైన్స్ పరంగానూ పాదాలకు వెండి ధరస్తే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. మన శరీరానికి చలువ చేస్తుంది. వాస్తవానికి ఆయుర్వేదంలో పాదాలు వెచ్చగా.. కడుపు మృదువుగా.. తల చల్లగా ఉండాలి అని ఓ సామెత ఉంటుంది. ఇవి ఆరోగ్యంగా ఉండే సహజ లక్షణాలు. అయితే నిజానికి బంగారం ఎక్కువగా వేడిని కలుగజేస్తుంది. అలాగే వెండి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలో బలం అనేది కింది నుంచి పైకి ప్రవహిస్తుంది. కాబట్టి చల్లటి స్వభావం గల వెండిని పాదాలపై ధరించినప్పుడు .. చల్లదనాన్ని శరీరానికి అందచేస్తుంది అని నమ్మకం. దీని వలన తలలో చల్లదనం ఉంటుంది. అలాగే మహిళలు అనేక ఆనారోగ్య సమస్యల నుంచి రక్షించబడతారు. అయితే మహిళలు ఎక్కువగా బంగారం ధరిస్తే శరీరం మొత్తం వేడిగా ఉంటుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
వెండి పట్టిలు ధరించినప్పుడు మహిళలు ఎక్కువగా నడిచినప్పుడు అవి రాపిడికి గురవుతాయి. దీంతో వీరి ఎముకలు బలంగా అవుతాయి. పూర్వం పురుషులు, మహిళలు ఆభరణాలు ధరించేవారు. కానీ ప్రస్తుతం మహిళలు మాత్రమే ధరిస్తున్నారు. పాదాలకు వెండి పట్టీలు ధరించడం వలన నడుము నొప్పి, మోకాలి నొప్పి, హిస్టీరియా వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు. అదే విధంగా మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది. అదే బంగారంతో తయారు చేసిన పట్టీలైతే ఒంట్లో వేడిని పుట్టిస్తుంది. అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
బంగారం వస్తువులు ఏవైనా మెడ, చేతులకు ధరిస్తేనే మంచిదని అంటున్నారు. బంగారం పూజ్యనీయమైంది. అందుకే కాళ్లకు ధరించి అవమానించకూడదు. అలాగే బంగారాన్ని ఇంట్లోని ఈశాన్యం మూలలో భధ్రపరచాలి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు కుడిచేతి ఉంగరపు వేలికి బంగారంతో చేసిన ఆభరణం ధరిస్తే ఫలితం ఉంటుంది.