Home Unknown facts సీత దేవి అడవికి వెళ్లడానికి రామ చిలుక శాపమే కారణమా ?

సీత దేవి అడవికి వెళ్లడానికి రామ చిలుక శాపమే కారణమా ?

0

ఒక రోజు మిథిలానగర అంత:పుర  స్త్రీలు  ఉద్యానవనానికి వచ్చారు. సీతాదేవి కూడా చెలికెత్తెలతో విహారానికి వచ్చింది. ఒక చెట్టుమీద చిలుకలు ముచ్చటలాడుకొంటున్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చినవి. మగచిలుక ‘‘ఈ దేశపు రాజుగారికే సీత నాగటిచాలలో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివధనుర్భంగం చేసి పెళ్లాడాడు’’ అని భార్యకు చెబుతున్నాడు. అది విన్న సీత, ఆ రెండు చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది.

sri ramudu‘‘మీరు ఎవరిగురించి మాట్లాడుకుంటున్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడెవరో చెప్పు. ఈ విషయాలు మీకెలా తెలుసు?’’ అని అడగగా.. ‘‘మేము వాల్మీకి ఆశ్రమంలో వుండేవాళ్లం. విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాము. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. అందులోని కథనే చెబుతున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు’’ అని చెప్పి, ‘‘మమ్మల్ని వదిలేయ్’’ అని ప్రార్థించాయి. ‘‘ఆ శుభకార్యం జరిగిన తరువాతే మిమ్మల్ని విడిచిపెడతాను’’ అని సీత అంటుంది.

అప్పుడు ఆ చిలుకలు ‘‘మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. పంజరంలో వుండలేము. అంతేగాక నా భార్య చూలాలు. శ్రమకు ఓర్వలేదు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు’’ అని కోరుతుంది. సీత.. ‘‘అయితే ప్రసవం అయ్యేంతవరకు ఆడచిలుక నా దగ్గరే వుంటుంది. నువ్వు వెళ్లు’’ అని మగచిలుకను అంటుంది. అప్పుడది.. ‘‘తల్లీ! దీనిని విడిచిపెట్టి నేను బ్రతకలేను. కరుణించి మమ్మల్ని విడిచిపెట్టు’’ అని దీనంగా ప్రార్థించింది. కానీ సీత వినలేదు.

ఆడచిలుక సీతతో ‘‘నా భర్త నన్ను విడిచి బ్రతకలేనంటున్నాడు. నేను అతనిని విడిచి వుండలేను. కాబట్టి మమ్మల్ని దయతో వదిలేయ్’’ అని అడుగుతుంది. అప్పటికీ సీత వారి మాటలను పట్టించుకోదు. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ వుంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి, సీతను చూసి ‘‘నువ్వెంత కఠినురాలివి. గర్భవతినైన నన్ను, నా భర్తనుండి విడదీశావు. కాబట్టి నువ్వు కూడా గర్భవతివైనప్పుడు నీ భర్తను ఎడబాసి దు:ఖపడతావు’’ అని శపించి.. తన ప్రాణాలను విడిచిపెడుతుంది.

మగచిలుక.. ‘‘నా భార్యను అన్యాయంగా చంపావు. కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడగా జన్మించి  పగ తీర్చుకుంటాను’’ అని వెళ్లి, గంగానదిలో పడి మరణిస్తుంది. అన్నట్టుగానే చాకలి వాడుగా పుట్టి తన పూర్వ జన్మ పగను తీర్చుకుంటాడు.

Exit mobile version