పార్వతీపరమేశ్వరుల మొదటి కుమారుడు వినాయకుడు. సమస్త దేవతలకు అధిపతి వినాయకుడు. అన్ని కార్యములకు, పూజలకు ఆయనను మొదటగా పూజిస్తారు అందుకే వినాయకుడిని గణనాయకుడు అని అంటారు. గణపతి శ్వేత రూపంలో దర్శనం ఆలయం ఒకటి ఉంది. మరి ఆ గణపతి తెల్లగా ఎందుకు ఉంటాడు? అలా వెలసిన ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.వరంగల్ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఈ శ్వేత గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్వేతార్కమూల గణపతిగా భక్తులచే పూజలందుకొంటున్నాడు. ఎక్కడైనా గణేశుని ఆకారం ఒకటే. అయితే ఆ రూపం ఏర్పడ్డ తీరును బట్టి ఫలాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా శ్వేతార్క గణపతి అమిత ఫలప్రదాత అన్నది వారి అచంచల విశ్వాసం. అయితే శ్వేతం అంటే తెలుపు, అర్కం అంటే జిల్లేడు తెల్లజిల్లేడు బెరడుతో చేసే గణపతి ప్రతిమలను శ్వేతార్క గణపతిగా పిలుస్తారు. తెల్లజిల్లేడు మొక్క మూలం నుంచి వెలిశాడు కాబట్టి ఇక్కడి గణపతిని శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారు. వందేళ్లపైబడిన ఈ ఆలయంలోని మూర్తిని ఏ శిల్పీచెక్కలేదు తెల్లజిల్లేడు మొదలు భాగంపై గణనాథుడే స్వయంగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ చెట్టు బెరడుపైని గణపతి మూర్తికి అన్ని అవయవాలు ప్రస్ఫుటంగా కనిపించడం విశేషం. నల్లగొండ ప్రాంతంలో వందేళ్లనాటి తెల్లజిల్లేడు మూలం నుంచి ఏర్పడిన గణపతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. నిజానికి శ్వేతార్కగణపతి దేవళం 29ఆలయాల సముదాయం. ఇక్కడ ఇద్దరు గణపతులు ఉన్నారు. ఒకరు శ్వేతార్క గణపతికాగా మరొకమూర్తి ఆదిగణపతి. ఇంకా ఈ ఆలయంలో నల్లరాతితో తీర్చదిద్దిన మహాలక్ష్మీ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ. శ్వేతార్కమూలగణపతి భక్తసులభుడు అని నమ్ముతారు. నాలుగు గడ్డిపరకలు, మరికొన్ని పుష్పాలు సమర్పిస్తే చాలు ఈశ్వతార్క మూలగణపతి ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మిక. శ్వేతార్క గణపతి షోడశ రూపాల్లో విశిష్టమన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడి వేలుపు కరుణ కోసం భక్తులు మాలధారణలూ చేస్తుంటారు. గణేశుడు 62రూపాలలో కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. అందులో 32 రూపాలు విశిష్టమైనవని, వాటిలోనూ షోడశ గణపతులు మహోత్కృష్టమనీ భక్తుల విశ్వాసం. ఆ పదహారు రూపాల్లోనూ శ్వేతార్క గణపతి పరమోత్కృష్టమని భక్తులు చెబుతారు. ఈ శ్వేతగణపతి నిజరూపానికి తగినట్టుగా తీర్చిదిద్దిన 18కిలోల వెండికవచంతో మూలమూర్తి ద్విగుణీకృత శోభతో దర్శనమిస్తాడు. ప్రతిమంగళవారం ఈ ఆలయంలో హోమం జరుగుతుంది. పంచామృతాలతో స్వామివారికి విశేషరీతిలో అభిషేకం నిర్వహిస్తారు. విబూది, పసుపు, కుంకుమలతో పాటు తేనె, పుష్పాలతో నిర్వహించే అభిషేకంలో ఉమాసుతుడు సప్తవర్ణశోభితుడిగా కనిపిస్తాడు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటి అంటే నవగ్రహాలకు వారి వారి దిశలను బట్టి విడివిడిగా ప్రత్యేక ఆలయాలూ ఉన్నాయి. దీంతో దోష నివారణ కోసం నిర్దిష్ట గ్రహానికే పూజలు నిర్వహించే వీలు ఈ ఆలయంలో ఉంది. శ్వేతార్క మూల గణపతి ఆలయంలో వందలాది మంది భక్తులు మాలధారణ కూడా చేస్తుంటారు. మండల, అర్ధమండల, పక్షం, లేదా 11 రోజలదీక్షను చేపడుతుంటారు. దాదాపు 17సంవత్సరాలుగా ఈ దీక్షలు నిర్వహిస్తున్నారు.ఇలా శ్వేత రూపంలో వెలసిన గణపతి సర్వవిఘ్నాలను నివారిస్తూ భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.