ఈ ఆలయం సముద్ర తీరాన ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, భక్తులు ముందుగా సముద్రంలో స్నానం ఆచరించి మళ్ళీ ఆలయ సమీపంలో ఉన్న పుణ్యతీర్థలలో స్నానం చేసి ఆ తరువాతే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఈ ఆలయంలో విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా, మచిలీపట్టణం నుండి 11 కీ.మీ. దూరంలో మంగినపూడి సముద్రతీరంలో శ్రీ దత్తాశ్రమ క్షేత్రం, శ్రీ నగరేశ్వరాలయం నెలకొని ఉన్నదీ. సముద్ర తీరానికి అతి చేరువలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో దత్తాత్రేయుడు, నగరేశ్వరస్వామి కొలువై ఉన్నారు.
విశాలమైన ప్రాంగణంలో ఇసుక తెన్నెలపై తూర్పు సముద్రతీరాన నిర్మించిన ఈ ఆలయం భక్తులని విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆలయంలో భక్తులు ముందుగా సముద్రస్నానం చేసి తరువాత ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ ఆలయానికి వెనుక వైపున 12 పుణ్యతీర్దాలలో బావులు నెలకొల్పారు. భక్తులు సముద్ర స్నానం తరువాత ఈ పుణ్యతీర్దాలలో కూడా స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామిని దర్శనం చేసుకుంటారు.
పూర్వం ఈ నగరేశ్వరస్వామి వారి దేవాలయం ముఖమండపం కూడా లేకుండా చిన్న ఆలయంగా ఉండేది. ఆ తరువాతి కాలంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ ఆలయాన్ని నిర్మించి ప్రమోద నామ సంవత్సరం మాఘ శుద్ధ చవితి నాడు స్వామిజి వారి పవిత్ర కరములచే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట జరిగింది.
ఈ ఆలయంలో స్వామివారి శివలింగరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడి ఆలయానికి ఎదురుగా హృషీకేశ్ గంగా ప్రవాహంలో స్వయంభువుగా లభ్యమైన 54 శివలింగాలను ప్రతిష్టించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న 12 తీర్దాలలోని నీటితో ఆ శివలింగాలను అభిషేకించి ఆ తరువాత స్వామి వారిని దర్శిస్తారు.
ఇక్కడి ఆలయంలో విశేషం ఏంటంటే, ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఆలయంలోని నవగ్రహ మండపంలోని గ్రహాధిపతులను, వారి వారి వాహనాలతో విడివిడిగా భక్తులు ప్రదిక్షణలు చేయడానికి అనువుగా నిర్మించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జయంతి రోజున ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.