పంచారామాలు అనే ఐదు శైవక్షేత్రములు ఉన్నట్లే, శ్రీ మహావిష్ణువుకు అయిదు చోట్ల శ్రీ భావన్నారాయణ స్వామి వారి క్షేత్రాలు ఉన్నాయి. ఆ ఐదు క్షేత్రాలలో ఇది ఒక ఆలయంగా చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, భావ దేవరపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పంచ భావన్నారాయణ క్షేత్రాలలో ఒకటైన శ్రీ భావన్నారాయణస్వామి వారి ఆలయం ఉంది. అయితే మిగతా నాలుగు, కాకినాడ నగరంలోనే ఒక భాగంగా ఉన్న సర్పవరంలో ఒకటి, గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలోని పెదగంజాంలో ఒకటి, పశ్చిమగోదావరి జిల్లా పట్టిసంలో ఒకటి. ఇలా మొత్తం ఐదు క్షేత్రాలు ఉన్నాయి.
ఇక ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభువుడు. మూడు అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారి అలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్వామివారికి పెద్ద పెద్ద మీసములు వెండితో చేసినవి ఉండటం ఒక ప్రత్యేకత. స్వామివారి మూర్తికి రెండువైపులా శ్రీదేవి, భీదేవిలా విగ్రహమూర్తులు ఉన్నాయి. ఈ ఆలయ మొదట చోళరాజులలో ఒకరు నిర్మించారని ఈ ఆలయంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది.
ఈ ఆలయంలో విశేషం ఏంటంటే సంవత్సరంలో అన్ని రోజులు వెలుగుతూ ఉండే అఖండ దీపారాధన సేవ ఒక ప్రత్యేకత. చాలామంది భక్తులు ప్రత్యేకించి ఈ అఖండ దీపారాధన కోసం ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. ఈ స్వామివారిని నిత్యం 6 గంటల నుండి 11 గంటలవరకు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు దర్శించవచ్చును. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయంలో వైశాఖమాసంలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.