శివజ్యోతి ప్రతిరూపాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు. వీటిలో 12 లింగాలు శక్తివంతమైనవి, ముఖ్యమైనవి అని చెబుతారు. అయితే ఈ పవిత్ర ప్రదేశంలో దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకేచోట కొలువై ఉండి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా ఇక్కడ మొత్తం 15 దేవాలయాలు భక్తులకి దర్శనం ఇస్తున్నాయి. మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో సోమశిల అనే గ్రామంలో అతి పురాతనమైన సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. కొల్లాపూర్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ లలితాంబిక సమేత శ్రీ సోమేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్నారు. మన దేశంలో నలుదిక్కులా ఉండే ద్వాదదశ జ్యోతిర్లింగాలు కొల్లాపూర్ కృష్ణాతీరాన సప్త నదుల సంగమ స్థానం సమీపంలోని సోమశిలలో గల శ్రీ లలితాంబిక సోమేశ్వరక్షేత్రంలో కొలువు తిరి ఉన్నాయి.
సప్తనదులు కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరది, మలాపహారిణి, భవవాసి నదుల ప్రవాహం సమీపంలో ఈ సోమేశ్వర క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేకత శివాలింగాలు ప్రతిష్ఠితమైన 15 ఆలయాలను చూడవచ్చు.ఇక ఈ ఆలయంలో శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదారేశ్వర, శ్రీ భీమాశంకర, శ్రీ సోమనాథేశ్వర, శ్రీ త్రయంబకేశ్వర, శ్రీ ఓంకారేశ్వర, శ్రీ రామలింగేశ్వర, శ్రీ నాగేశ్వర, శ్రీ విశ్వేశ్వర, శ్రీ మల్లికార్జున, శ్రీ వైద్యనాథేశ్వర, శ్రీ ఘృష్ణేశ్వర మొదలగు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ భక్తులకి దర్శనం ఇచ్చును. అయితే పూర్వం రాష్ట్రకూటులు, కళ్యాణి చాళిక్యులు, విజయనగర మహారాజుల పాలన నుండి కొల్లాపూర్ సురభి సంస్థానాధీశుల వరకు మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవ్వడంతో ఎగువ మిట్టకి తరలించి మల్లి నిర్మించారు. పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దేశంలోని అన్ని జ్యోతిర్లింగాలు సప్తనదుల మధ్య కొలువై ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి, కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా పుష్కరాల సమయంలో భక్తులు ఎక్కవ సంఖ్యలో వచ్చి నది స్నానమాచరిస్తారు.