మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో గర్భగుడిలోని దేవుడికి ఒక విశేషం అనేది ఉంటుంది. ఇంకా ఆ ఆలయ నిర్మాణం, శిల్ప కళ నైపుణ్యం ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా అధ్బుతంగా ఉంటాయి. అయితే కొన్ని ఆలయాల నిర్మాణము మాత్రం చాల ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎవరికీ అంతుపట్టకుండా ఉంటాయి. అలంటి ఆలయం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఆలయం ఎలా నిర్మించారు అనేది ఇప్పటికి అందరికి ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ సందేహాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరులో శ్రీ రామాప్రమేయస్వామి ఆలయం ఉంది. శ్రీరామచంద్రుడు ఇక్కడ కొంతకాలం వున్నాడనీ, ఆ సమయంలో విష్ణుమూర్తిని అప్రమేయస్వామిగా ఇక్కడ ప్రతిష్టించి పూజించాడనీ అంటారు. శ్రీరాముడిచేత ప్రతిష్టించబడిన అప్రమేయస్వామి రామాప్రమేయస్వామిగా పేరుపొందాడు. శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం వున్నాడుకనుక వింధ్యపర్వతానికి దక్షిణ దిశగావున్న ఈ స్ధలాన్ని దక్షిణ అయోధ్యగా అభివర్ణిస్తారు. బ్రహ్మాండ పురాణంలో క్షేత్రమహత్యం కాండలో అప్రమేయస్వామి గురించి 12 అధ్యాయాలలో వర్ణించారు. అతి పురాతనమైన ఈ ఆలయం 3000 సం. ల క్రితం నిర్మించారని చెబుతుంటారు. అయితే చారిత్రిక ఆధారాల ప్రకారం 1500 సం. కి పూర్వందంటారు.శ్రీ వైష్ణవ మత ప్రచారకుడు శ్రీరామానుజులవారు కర్ణాటక రాష్ట్రంలో దిగ్విజయం సాధించటానికి ముందే ఈ ఆలయం ఉందని చెబుతారు. 980లో స్వామి నందా దీపం కోసం ఇవ్వబడ్డ దాన పత్రం ఇప్పటికీ భద్రంగా వుంది. పురాణాల ప్రకారం కణ్వ మహర్షి మొదలగు అనేక ఋషులు ఈ స్వామిని సేవించారు. కపిల మహర్షి ఈ స్వామి కళ్యాణ గుణాల గురించి ప్రజలకి బోధపరచి, ముక్తి మార్గాన్ని బోధించారు. కపిల మహర్షి, కణ్వ మహర్షి ఈ స్వామిని అర్చిస్తూ ఇప్పటికీ ఇక్కడ వున్నారని ప్రజల విశ్వాసం.
అయితే ఈ ఆలయంలో, రాత్రి ఆలయం తాళం వేసిన తర్వాత గర్భగుడి తలుపుల తెరిచిన శబ్దం, గంటల శబ్దాలు వినబడతాయి. ఈ ధ్వనుల ఆధారంగా ఆ మహామునులు ఏకాంతంలో స్వామిని అర్చిస్తున్నారని విశ్వసిస్తారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో విశేషం కూడా ఉంది. అది ఏంటంటే ఈ ఆలయం ఏ గట్టి పునాదుల మీద కాక ఇసుకలో నిర్మింపబడింది. నిర్మాణ రీతులు బట్టి ఈ ఆలయం తదుపరి కాలంలో ఈ ప్రాంతాల నేలిన రాజులచేత విస్తరింపబడింది తెలుస్తున్నది.ఇంకా ఈ ఆలయంలో ద్రావిడ శిల్పకళా రీతిలో నిర్మింపబడిన సమున్నతమైన రాజగోపురంలో 30 అడుగుల ఎత్తైన మహద్వారం, ఆ ద్వారం ఎదురుగా ఒకే రాతిలో మలచబడ్డ 30 అడుగుల ఎత్తున్న దీపస్తంబమున్నది. ఆలయం ముఖమండపంలో రాగితో చేయబడ్డ స్వామివారి వాహనాలున్నాయి. ప్రదక్షిణ మార్గంలో రాతి స్తంబాలమీద దశావతారాలు, శ్రీకృష్ణుని బాల్య లీలలు చెక్కబడ్డాయి. అంతేకాకుండా ఆలయంలో ఉన్న స్వామివారు శ్రీరాముడిచేత ప్రతిష్టించబడ్డారు గనుక శ్రీ రామాప్రమేయ స్వామి అనే పేరు వచ్చింది. స్వామి చతుర్భుజుడు. చేతులలో శంఖం, చక్రం, గద ధరించి, అభయ హస్తంతో భక్తుల ఆర్తి తీర్చే ఈ స్వామిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన అప్రమేయస్వామి ఉత్సవ విగ్రహంతోబాటు స్వామి సేవలో వున్న రామానుజాచార్యుల విగ్రహంకూడా చూడవచ్చు. ఈ ఆలయంలో వున్న బావిలో నీరు చాలా స్వఛ్ఛంగా, తియ్యగా వుంటాయి. స్వామి కైంకర్యానికి,తీర్ధ ప్రసాదాలకీ, ఈ నీటినే ఉపయోగిస్తారు. ఈ ఆలయం ఇసుక లో ఎలా నిర్మించడం ఎలా సాధ్యం అయింది అంతేకాకుండా తాళం వేసిన తరువాత గర్భగుడిలో వచ్చే శబ్దాలు ఏంటి అనే సందేహాలు ఇప్పటికి అలానే ఉండిపోయాయి.