Home Regional Everything You Need To Know About The Famous ‘Kotappakonda Sri Trikoteswara Swami...

Everything You Need To Know About The Famous ‘Kotappakonda Sri Trikoteswara Swami Temple’ In Andhra Pradesh

0

సర్వం శివం.. త్రికూటేశ్వరం

Whatsapp Image 2021 03 11 At 10.23.56 Amభారతదేశం ఎన్నో ప్రాచీన ఆలయాలు, వారసత్వ సంపదకు పుట్టినిల్లు. మనం పుట్టి పెరిగిన ఈ దేశంలో ఎన్నో వింతలు, విశేషాలున్న ఆలయాలు ఉన్నాయంటే మనకే ఒకోసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వింతలను మనం చూస్తే కానీ నమ్మలేం.. చూశాక నిజమే అంటూ ముక్కున వేలేసుకుంటాం. వాటి విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు మన మనసు భక్తిభావంతో నిండిపోతుంది. అలాంటి వింతలు, విశేషాలున్న ఆలయాల్లో గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలోని కోటప్పకొండ ఒకటి. ఈ కొండపై ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా.. ఇక్కడ కొలువైన స్వామిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా ‘కోటప్పకొండ’ శివాలయం గురించి తెలుసుకుందామా..!

కాకులు కనిపించని కొండ…
శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం ఇక్కడి ప్రధాన విశేషం. కాకులు దూరని కారడవి అని విన్నాం.. కానీ కాకులు వాలని కొండ ఏంటి అనుకుంటున్నారా? అవునండి.. కోటప్పకొండపై కాకులు వాలవు. మనం కొండ ఎక్కేటప్పుడు దారిలో ఒకటి, రెండూ కనిపించినా.. కొండపైన మాత్రం కాకుల జాడ కనిపించదు. అసలు ఈ కాకులు కొండపై ఎందుకు వాలవు..? అసలు ఏంటీ కథ..? తెలుసుకోవాలంటే ముందు మనం ఆలయ పురాణగాథ తెలుసుకోవాలి.

ఆలయ పురాణ గాథ…

* పూర్వం త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలోని కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్యతో కలిసి జీవించేవాడు. సుందుడు ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరున్ని సేవించేవాడు. కొద్ది రోజుల తరువాత సుందుడి భార్య కుమార్తెకు జన్మనివ్వడంతో ఆమెకు గొల్లభామ (ఆనందవల్లి) అని పేరు పెట్టి గారాబంగా పెంచారు. ఆనందవల్లి శివ భక్తురాలు. ప్రతిరోజు రుద్రకొండపై శివుడికి పూజలు చేసేది. ఆమె పుట్టిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో కళకళలాడింది. ఒకరోజు ఆమెను పరీక్షించాలని శివుడు కన్య అయిన ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. అయినా ఆమె ప్రతి రోజు గుడికి వెళ్లి పూజలు చేసేది. ఒకరోజు ఎప్పటిలాగే శివుడి అభిషేకానికి కుండలో నీళ్లు తీసుకువెళ్తుండగా అలసిపోయి కొండపై సేద తీరుతున్న సమయంలో ఓ కాకి కుండపై వాలింది. ఆ పరమశివుడి కోసం తీసుకెళ్తున్న నీటి కుండపై కాకి వాలిందనే కోపంతో ఆమె శపించింది.. ఇక నుండి ఈ ప్రాంతంలో ఏ కాకీ వాలకూడదని. దీంతో నాటి నుంచి నేటి వరకు.. కొండపై కాకుల జాడే ఉండదు.

* గర్భంతో ఉన్న ఆనందవల్లి ఒకరోజు పరమేశ్వరున్ని ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నాని, నీవే దిగి రావాలని. ఇది విన్న శివుడు సరే అని ఒప్పుకుని ఒక షరతు పెడతాడు. అదేంటంటే.. నీవు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో మాత్రం ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని అంటాడు. కానీ, ఓ రోజు ఆనందవల్లి పూజ చేసి వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న ఆనందవల్లి దేవుడిలో ఐక్యమైపోతుంది. మనం ఆనందవల్లి గుడిని ఇక్కడే కొండ కింది భాగంలో చూడొచ్చు.

మరికొన్ని ఆలయ విశిష్టతలు…

* శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు.
* పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే.
* ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని నమ్మకం. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్లి త్రికూటేశ్వరున్ని సేవించాలని అంటారు.
* శివరాత్రికి వివిధ గ్రామాల నుంచి ప్రభలను తీసుకురావడం ఇక్కడ ఆనవాయితీ. నలభై అడుగుల నుంచి వంద అడుగుల వరకు విద్యుత్ దీపాల అలంకరణతో ఏర్పాటు చేసేవే ప్రభలు. వాటిని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి.. ఓ ఖాళీ ప్రదేశంలో ఉంచి శివరాత్రి రోజు వాటి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* ప్రధాన ఆలయానికి కుడివైపు వెనక భాగంలో పరమశివుడి సుపుత్రుడైన విఘ్నేశ్వరుడి పెద్ద విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది.

ఇవండీ.. మహా శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్న కోటప్పకొండ ఆలయ విశేషాలు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా..? అయితే.. మీ అనుభూతులను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇప్పటివరకు వెళ్లనివారు ఎవరైనా ఉంటే వీలు చూసుకుని దర్శించుకుని రండి.. ఆ పరమశివుని కటాక్షం పొందండి.
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..

Exit mobile version