గౌతముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు. అయితే అయన ఇక్కడ శివలింగం ప్రతిష్టించడం మరియు గంగ ఈ ప్రదేశానికి రావడం వెనుక ఒక కథ వెలుగు ఉంది. మరి ఆ కథ ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, కరీంనగర్ జిల్లా, మంథని మండలంలో గోదావరి నది తీరమున ఒక చిన్న కొండపైన గౌతమేశ్వరాలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. అయితే చోళుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. తరువాత కాలంలో కాకతీయరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. ఇక స్థల పురాణానికి వస్తే, శివుడు గంగను జటాజూటమునందు ధరించి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తలచి, పార్వతి గంగను వదిలేయమంది. అందుకు శివుడు అంగీకరించలేదు. అందువలన పార్వతి అలుక వహిస్తుంది. గణపతి ఇదంతా గ్రహించి తల్లితో సహా కుమారస్వామిని తీసుకొని గౌతముని ఆశ్రమానికి వస్తాడు. అక్కడే ఉంటూ ఒకసారి గణపతి జయని పిలిచి ఆవురూపం ధరించి గౌతముని చేలలో మేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో పడి మేయసాగింది. ఆ సమయంలో గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే, గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణించింది. గౌతముడు విచారంతో గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోడానికి పరమేశ్వరుడిని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు కరుణించి, అతని కోరికను మన్నించి, ఆ మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేసాడు. అప్పుడు గంగాదేవి శివుడ్ని కూడా తనతో పాటే అచట ఉండాలని కోరింది. ఆమె కోరిక ప్రకారం శివుడు అచట ఉన్న కొండపైన వెలిసాడు. ఆ శివలింగాన్ని గౌతముడు అచటనే ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకించి తరించాడు. గంగ ఆనాటి నుండి గౌతమిగా మారింది. ఆ పవిత్రతను తిలకించిన పార్వతీదేవి సంతోషంతో పరమేశ్వరునిలో సగభాగముగా లీనమైంది. ఈ చిన్న ఆలయంలో గర్భగృహం, మండపం అను రెండు భాగాలుగా ఉన్నదీ. గర్భాలయంలో గౌతమేశ్వరుడు పార్వతిమాత, అదేవిధంగా మండపంలో నందీశ్వరుడు, కుడివైపున వినాయకుడిని మనం దర్శించగలము. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవం వైభవంగా జరుపుతారు.