Home Unknown facts ధనత్రయోదశి అనిపేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి

ధనత్రయోదశి అనిపేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి

0

పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌రాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘చోటీ దివాళీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అనిపేరు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసి, ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు అందమైన రంగవల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి, సిరిసంపదలతో తులతూగుతారని నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతకు తగినట్లు బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు.

Dhanatrayodashiపురాణాల్లోని ఓ కథ దీని గురించి తెలియజేస్తుంది. హిమ అనే రాజు కుమారుడు వివాహమైన నాలుగో రోజు మరణిస్తాడని అతడి జాతకంలో ఉంటుంది. అతడి 16 వ ఏట మరణం తథ్యమని జ్యోతిషులు పేర్కొంటారు. అయితే ఓ రాజకుమారితో అతడికి వివాహం జరిపించిన హిమరాజు తన కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్లైన మూడో రోజు తన భర్తను మృత్యువు నుండి  కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి, జాగారం చేసింది. విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి, ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి, భగవంతుని స్మరిస్తూ, తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచింది.

ఆ మర్నాడు ఉదయం యమ ధర్మరాజు ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసకబారిపోవడమే కాదు, లోనికి ప్రవేశించలేకపోయాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్లిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు త్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ‘ధనత్రయోదశి’ని నిర్వహిస్తున్నారు.

ఈ పండుగను ఆయా ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో నైవేద్య పేరుతో నిర్వహిస్తారు. కొత్తమీర విత్తనాలు పొడిచేసి అందులో బెల్లం కలిపి నైవేద్యం తయారుచేసి, లక్ష్మీదేవికి సమర్పిస్తారు. దక్షిణాదిలో ఆవులను ఆభరణాలతో అలకరించి పూజిస్తారు. వ్యాపార సంస్థలను అందంగా అలంకరిస్తారు.

పురాణాల మరో కథనం ప్రకారం… పాలకడలిలో శేషతల్పంపై పవళించే మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి.  కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణునివాసమైన వైకుంఠానికి వెళతాడు.అక్కడ తనను గమనించని లక్ష్మీ, విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై, శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో  తంతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ, కాళ్లు పట్టుకుని, ఆపై భృగువుకు అరికాలులో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని, అహంకారాన్ని హరిస్తాడు.

తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవడం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది. ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి.  లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చింది త్రయోదశి కాబట్టి, అది ‘ధన త్రయోదశి’ అయింది.

ఈ రోజుని వెండి కొనడానికి ముఖ్యమైన రోజుగా చెప్తారు. అక్షయ తృతీయ బంగారానికి ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటే ధన త్రయోదశిని వెండి లోహాన్ని కొనడానికి ప్రశస్తమైనవిగా చెప్తారు. ఈరోజు గుజరాతీయులకు సంవత్సరాది. అంటే మనకు ఉగాది లాగా విభజన జీవులకి ఉగాది అన్నమాట. ధన త్రయోదశి నాడు హిందువులు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. అలికి రంగురంగుల ముగ్గులు పెడతారు. శుచిగా ఉంటే మహాలక్ష్మి వృద్ధి చెందుతుందని, అమ్మవారికి ఆనందమని ఇంటిని శుభ్రం చేసుకుంటారు. నిజానికి ఈ రోజు నుండే దీపాలు అలంకరించడం ప్రారంభమవుతుంది. తలస్నానము చేసి కొత్తబట్టలు కట్టుకుని పండగల జరుపుకోవడం విశేషం.

Exit mobile version