కరోనా వలన ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపే ఉద్యోగస్తులందరు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుండే పని చేయడం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం లేదు. శారీరక శ్రమ లేకపోతే బరువు పెరగడంతో పాటు జీవనశైలికి సంబంధించిన వ్యాధులైన బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. కొంతమంది బయటకి వెళ్లి వస్తున్నప్పటికీ, శారీరక శ్రమ ఉంటున్నప్పటికీ బరువు పెరిగిపోతుంటారు. అయితే ఇక్కడ బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
రోజూ నిద్రపోయే ముందు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీకు తెలియకుండానే బరువు పెరిగే ప్రమాదం ఉంది. రాత్రి భోజనం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం.. ఆ వెంటనే నిద్రపోవడం వల్ల బరువు ఎక్కువవుతుంది.. పొట్ట విపరీతంగా పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలు… ఇవి కూడా బరువును పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. నిద్రపోయే ముందు ఎక్కువగా ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. దాంతో అది అలసిపోయి నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడతారు. ఇలాంటి చాలా సందర్భాల్లో బరువు పెరుగుతుంటారు. నిద్రలేమి కూడా బరువు పెరగడానికి ఓ కారణమని నిపుణుల అభిప్రాయం.
ఆలస్యంగా నిద్రపోవడం… పెరిగిన పని వేళలు, అదేపనిగా మొబైల్, ల్యాప్టాప్ చూడటం వల్ల కూడా నిద్రాభంగం అవుతుంది. కళ్లకు విశ్రాంతి ఉండదు. దాంతో నిద్రపట్టదు. ఇది క్రమేపీ బరువు పెరుగుదలకు కూడా కారణమవుతుంది. పీరియడ్స్ టైమ్లో ఆడవారిలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా శరీర బరువు పెరగడం, కడుపునొప్పి, మొటిమలు ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. పీరియడ్స్కి ముందు, స్టార్ట్ అయ్యాక ఈ సమస్యలు వస్తాయి
గణాంకాలు చెబుతున్న ప్రకారం ప్రతి 5 మందిలో 2 మంది దీని బారిన పడుతున్నారు. అయితే బరువు అధికంగా పెరుగుతున్నారని శరీరం ముందుగానే పలు సూచనలు, సంకేతాలను ఇస్తుందట. వాటిని తెలుసుకోగలిగితే అధిక బరువు పెరగకుండా బరువుని అదుపులో పెట్టుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒకటి లేదా రెండు నెలల్లో దుస్తులు బిగుతుగా మారాయి అంటే.. అధికంగా బరువు పెరిగారని అర్థం. కనుక వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నడుం చుట్టు కొలత మారుతుంది. దీంతో దుస్తులు పట్టవు. కాబట్టి ఈ సంకేతం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. చిన్న పని చేసినా అలసి పోతున్నా లేదా మెట్లు ఎక్కలేకపోతున్నా.. మీరు అధికంగా బరువు పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అధికంగా బరువు పెరుగుతున్న వారికి శ్వాసకూడా సరిగ్గా ఆడదు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అధికంగా బరువు పెరిగే వారిలో మలబద్దకం సమస్య వస్తుంది. సుఖ విరేచనం అవదు. ఇక స్త్రీలలో అయితే రుతు క్రమం సరిగ్గా ఉండదు.
అధిక బరువు ఉండటం వల్ల కాళ్ల సిరలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది గుండెకు రక్తాన్ని తీసుకురావడానికి పని చేస్తుంది. బరువు పెరుగుతుంటే సిరల ద్వారా రక్తం సరిగా వెళ్లదు. దీని కారణంగా కాళ్లు, పాదాలలో వాపు వస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల కాళ్ల సిరల్లో గడ్డలు పెరుగుతాయి. బరువు పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తుంటే జాగ్రత్త పడాల్సిందే. ఈ లక్షణాలు, సంకేతాలను గుర్తించడం ద్వారా మీరు అధికంగా బరువు పెరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు. దీంతో వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీని వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.