కరోనా కోరల నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. మాస్కులు పెట్టుకుంటున్నాం, శానిటైజర్ వాడుతున్నాం, ఇక కరోనా రాదూ అనే భ్రమలో వ్యాక్సిన్ వేసుకోవడం మానకూడదని నిపుణులు మరీ మరి చెబుతున్నారు. అంటే వ్యాక్సిన్ పాత్ర ఏంటో అర్థం అవుతుంది. ముందు ఒక్క డోస్ వేసుకుంటే చాలు బతికిపోతాం అనుకున్నాం, కానీ ఆ తరువాత రెండు డోసులు పెడితేనే దాని ప్రభావం ఉంటుందని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాల్ని కుదిపేస్తోంది. ఇండియా సహా 150కి పైగా దేశాల్లో ఇది విస్తరించి ఉంది. అన్ని దేశాల్లోనూ తీవ్రంగానే ఉంది. దీన్ని వ్యాక్సిన్లు కొద్దిగా ఆపగలుగుతున్నా… పూర్తిగా ఆపలేకపోతున్నాయి. పైగా 2 డోసులు వేసుకున్న వారికి సైతం యాంటీబాడీలు కొంతకాలం తర్వాత తగ్గిపోతున్నాయట. అందుకే మూడో డోస్ పడాలి అంటున్నారు.
అలాంటి వైరస్ను ఎదుర్కోవాలంటే బాడీలో ఎక్కువ యాంటీబాడీలు ఉండాలని అంటున్నారు. అందుకోసం మూడో డోస్ వేసుకోవాలి అని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ల కట్టడికి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా కూడా అన్నారు. కాలం గడిచే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి బూస్టర్ డోసులు అవసరమన్నారు.
అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీలు ఫైజర్, బయోఎన్టెక్, మోడెర్నాలు ఇప్పటికే కోవిడ్ మూడో డోసును కొందరికి ఇస్తున్నాయి. అవయవమార్పిడి చేయించుకున్న వారికి మూడో డోసు కోవిడ్ టీకాలను ఇస్తున్నారు. అయితే రెండో డోసు వేసుకున్న తరువాత 6 నుంచి 8 నెలల లోపు మూడో డోసు తీసుకుంటే పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని ఆయా కంపెనీలు కూడా అభిప్రాయపడ్డాయి.