జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పి అనేది సర్వ సాధారణమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురికి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. చిన్న పెద్దా ఎవరైనా కాసేపు కూర్చుంటే చాలు నడుము నొప్పి అని పడుకుంటున్నారు. చాలా వరకు నడుము నొప్పి ఎటువంటి చికిత్స లేకుండా తగ్గిపోతుంటుంది. కానీ తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నడుము నొప్పి ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం ఉత్తమం. చాలా వరకు నడుమునొప్పికి కారణం వారి జీవణశైలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజంతా కంప్యూటర్ల ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల చాలామంది బ్యాక్పెయిన్కు గురవుతున్నారు. ఒకే పొజీషన్లో ఎక్కువగా కూర్చోవటం, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించడం, వెన్నుకు దెబ్బ తగలడం, వెన్నుకు సంబంధించిన ఎముకలు, కండరాలు, డిస్క్, వెన్నుపూస క్షయకు గురికావడం, వెన్నెముకకు కణుతులు, అండాశయ వ్యాధుల వల్ల నడుము నొప్పి వస్తుంది. దీంతో పాటు గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది.
నడుము నొప్పి ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూరం తిన్న తర్వాత వేడి నీరు తాగితే నడుము నొప్పి నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే గంధం, శొంఠిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని నడుముకు అప్లై చేయాలి. ఇలా చేస్తే కాస్త ఉపశమనం దొరుకుతుంది. తగ్గకుంటే ఆ మిశ్రమం మీద తెల్లజిల్లేడు ఆకులు కడితే బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని అందులో మూడు టీస్పూన్లు సున్నపు తేట వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు ఉదయాన్నే తాగాలి. ఇలా చేస్తే నడుము నొప్పి నుండి విముక్తి పొందొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
అలాగే తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ఫుడ్ను పక్కనపెట్టి పాలు, చీజ్, పెరుగు, బీట్రూట్, గెనిసిగడ్డలు, ద్రాక్ష, దానిమ్మ, బెర్రీస్, పుచ్చకాయ, క్యారెట్లు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు వంటలలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, దాల్చిన చెక్క వంటి వాటిని చేర్చాలంటున్నారు నిపుణులు.