నేటి రోజుల్లో ఆడవారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో పీసీఓడీ ప్రధానమైనది. పీసీఓడీ అంటే పాలిసిప్టిక్ ఓవరీ డిసీజ్ అని అర్ధం.15 నుంచి 35 సంవత్సరాలలోపు మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచంలో 20 శాతం మంది మహిళలు పీసీఓడీ సమస్యతో సతమతమవుతున్నారు. మన దేశంలోని స్ర్తీల సమస్యల్లో 50 శాతం మంది పీసీఓడీతో బాధపడుతున్నారు.
పీసీఓడీ రావటానికి కారణం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత. కొన్ని కారణాల వల్ల అనవసరపు హార్మోన్లు పెరిగిపోవడం, కావాల్సిన హార్మోన్లు తగ్గిపోవడం జరుగుతుంది. టెస్టొస్టిరాన్, ఎఫ్ 1హెచ్, ప్రొలాక్టివ్ పెరగటం, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్లు తగ్గిపోతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయాల్లో నీటి బుడగల లాంటి సిస్టిలు ఏర్పడతాయి. అధిక బరువు ఉన్న స్త్రీలలో ఈ హార్మోన్ల అసమతుల్యత సమస్య త్వరగా వచ్చే అవకాశం ఉంది. తద్వారా పీసీఓడీ సమస్య వస్తుంది. డయాబెటిస్, హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి పీసీఓడీ వచ్చే అవకాశం అధికంగా ఉంది.
ఆహారంలో ఎక్కువ జంక్ఫుడ్ తినడం వల్ల కూడా పీసీఓడీ వచ్చే అవకాశం ఉంది. ఆధునిక జీవన విధానాలు, శారీరక శ్రమ, వ్యాయామం చేయని వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. సమయానికి ఆహారం తినక పోవడం. గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల కూడా కొన్ని సార్లు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పీసీఓడీ వచ్చినపుడు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
సమస్య మొదలైన వెంటనే.. దాని ప్రభావం కనిపిస్తుంది. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, వచ్చినా బ్లీడింగ్ ఎక్కువ కావడం లేదా తక్కువ అవడం, కడుపునొప్పి, అవాంఛిత రోమాలు, మెడ దగ్గర నల్లబడటం, జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీళ్లలో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం అధికంగా బరువు పెరగడం. సంతానలేమి సమస్య కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే అందుబాటులో ఉన్న గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.