మన దేశంలో ఎన్నో మహిమలు గల ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని దేవాలయాలు చిత్రమైన ఆచారాలతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలా ఎన్నో మహిమలు గల ఆలయాలలో ఈ లక్షింనరసింహ స్వామి దేవాలయం ఒకటి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశిష్టత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా దేవుడి సన్నిధిలో మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరాలని ముడుపులు కట్టడం చూస్తుంటాము. కానీ కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటి గెలలు కట్టడం చూశారా మీరు విన్నది నిజమే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏదైనా కోరికలు కోరుకుని స్వామి వారి సన్నిధిలో అరటి గెలను సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ ఆలయంలో వెలసిన నరసింహ స్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గర పందిరి వేసి ఉంటుంది. భక్తులు అరటి పండ్ల గెలలను ఆ పందిరికింద కట్టి కోరికను కోరుకుంటారు. మరికొంత మంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ఈ విధంగా అరటి పండ్ల గేలను కట్టి స్వామివారి మొక్కు తీర్చు కుంటారు.
పురాణాల ప్రకారం ఈ గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు. ఈ స్వామీజీ ఆ గ్రామంలో ఉన్న వారికి ఎటువంటి వ్యాధికైనా వైద్యం చేసి నయం చేసేవాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ గ్రామంలోనే ఉంటూ తర్వాత మరణించారు.
అయితే స్వామి వారు సజీవంగా ఉన్నప్పుడు కేవలం అరటి పండ్లను మాత్రమే తినేవారని భక్తులు ఈ రావిచెట్టుకు అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. అప్పటినుంచి గ్రామంలో ఉన్న ఆలయంలో ఏవైనా కోరికలు నెరవేరాలంటే స్వామి వారి సన్నిధిలో ఉన్న రావి చెట్టుకు అరటికాయలను సమర్పించి కోరికను కోరేవారు.