పార్వతీదేవిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. అయితే ఇక్కడ వెలసిన మంగళాదేవిని పార్వతీదేవి అంశగా భక్తులు కొలుస్తారు. ఈ ఆలయానికి వచ్చే ఈ అమ్మవారిని దర్శించిన వారికీ వివాహ సంబంధమైన గ్రహదోషాలు నశించి శుభాలు జరుగుతాయి. అంటే మంగళాలు జరుగుతాయి. అందుకే ఈ దేవిని మనగాళాదేవి అనే పేరుతో భక్తులు పూజిస్తారు. మరి ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, మంగుళూరు నగరానికి కొంత దూరంలో బోలారా అనే ప్రదేశంలో మంగళాదేవి ఆలయం ఉంది. ఒకప్పుడు మంగుళూరును మంగళాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరే మంగుళూరుగా మారింది. అయితే మంగళాదేవి ఈ ప్రాంతంలో వెలసినందు వలనే ఈ ప్రాంతానికి మంగళూరు అనే పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనదిగా చెబుతారు.
ఈ ఆలయాన్ని నాథ వంశీయుడైన మత్స్యేంద్ర నాథుడు నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడింది. ఇందులో అధ్భూతమైన చిత్ర కళాకండాలు కలవు. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శిస్తే వారి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వివాహం కానీ యువతులు ఇచట మంగళాదేవి వ్రతం ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వారి నమ్మకం. ఇంకా ఇచట వివాహం జరిగినచో వారి వైవాహిక జీవితం సుఖప్రదంగా ఉంటుందని కూడా వారి నమ్మకం.
ఈ మంగళాదేవి దేవాలయం స్వయంవర పార్వతి పూజకు, మంగళధార వ్రతమునకు ప్రసిద్ధి చెందినది. మంగళాదేవి దర్శించినవారికి వివాహ సంబంధమైన గ్రహదోషాలు నశించి శుభాలు జరుగుతాయి. ఈ ఆలయంలో దసరా మరియు వినాయక చవితి పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శిస్తారు.