Home Unknown facts గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం !!! ఇంతకీ ఎవరు...

గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం !!! ఇంతకీ ఎవరు గట్టమ్మ తల్లి??

0
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర గురించి వినని వాళ్లుండరు. గిరిజన వన దేవతలు శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే క్రమంలో మేడారం జాతర వివిధ మార్గాల్లో ప్రతిష్ఠితమైన అనుబంధ దేవత ‘‘గట్టమ్మ తల్లి’ని భక్తులు దర్శించుకుని తనివితీరా భక్తి పారవశ్యంతో మొక్కుకొని అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు. 
గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి, అడవి మార్గాల్లో జంగాలపల్లి ఆవల ములుగు ప్రేమనగర్ (గట్టమ్మ పల్లి) వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క, సారలమ్మల దేవతలు అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.
గట్టమ్మ తల్లి కూడా కోరినవారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహా మహిమాన్విత శక్తి దేవత అయినందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తిశ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాతృలై పలువురు భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖసంతోషాలతో చల్లగా వర్థిల్లుతున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లి భక్తులయ్యారు.
వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి గుడులు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవం, మేడారం ములుగు మార్గంలో ఉన్న ఈ తల్లిని ముందుగా దర్శిచుకుని తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారంకు వెళతారు. ఈ తల్లి పూజల్ని గిరిజన పూజా సాంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. ఇంతకూ గట్టమ్మ తల్లి ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏమిటి? ఆ తల్లి చరిత్రను తెలుసుకోడానికి ప్రతీ భక్తుడు ఆరాటపడుతాడు, ఆసక్తిగా తెలుసుకుంటాడు.
సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజు, సోమక్క, లక్ష్మక్కలు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తితో మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం భీకర యుద్ధం సాగించిన క్రమంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా అసమాన, ధైర్య, శౌర్య, పరాక్రమాలతో, అనుపమ త్యాగశీలంతో శతృవులతో రణం చేసి గొప్ప యుద్ధవీరవనితగా పేరు తెచ్చుకుని చరిత్రకెక్కింది.
గట్టమ్మతల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శతృవుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులైనారు. అందుకే ఈ అమర వీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. ఈ అమర వనవీరులతో పాటు మేడారం యుద్ధ అమరవీరులు గండ్రగొడ్డలి బాలగోము బాలకుమారస్వామి, దూలిమిత్తి, కొలకాడు సీతారామన్న కాసాలనాయుడు, ఉయ్యాల బాలుడు, గట్టమీది ముసలయ్య, ముసలమ్మ, కృష్ణస్వామి, పోతరాజు తదితరులకు కూడా గుళ్ళు కట్టి గొప్ప జాతరలు నిర్వహిస్తున్నారు.
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి, సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లనేనని చెబుతారు. అందుకే శ్రీ ఆంజనేయస్వామి నమ్మినబంటు కావడం వల్లనే శ్రీ రామునితో సమానంగా, శ్రీ నందీశ్వరుడు శివశంకరునితో సమానంగా పూజలందుకుంటున్నట్లుగా, శ్రీ గట్టమ్మతల్లి నమ్మినబంటు కావడం వల్లే శ్రీ సమ్మక్క, సారలమ్మ తల్లులతో సమానంగా పూజలందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు.
గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం మెండుగా నాటుకుపోవడంతో ములుగు సమీపానగల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య దినదినం పెరుగుతోంది. మంచి భర్త దొరకాలనీ, పెళ్ళికాని అమ్మాయిలూ, సంతానం కావాలనీ పలువురు మహిళలూ, మంచిగా పంటలు పండాలనీ రైతులూ, తమ బిడ్డల్ని చల్లగా కాపాడాలని తల్లిదండ్రులు, తమ దీర్ఘకాలిక రోగగాలు నివారించబడాలనీ రోగులు, తమ కష్టాలు మటుమాయం కావాలని పలువురు, తమకు మంచి చదువులు, తద్వారా మంచి ఉద్యోగాలు రావాలని విద్యార్థినీ విద్యార్థులు అనేకమంది ఇలా ప్రతి ఒక్కరు తమ సమస్యల్ని పరిష్కరించాలనీ గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటారు.
అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయాలు సాధించుకుంటున్నరు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరోశక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది.

Exit mobile version